పదేండ్లలో 32 రెట్లు పెరిగిన సౌరశక్తి సామర్థ్యం

పదేండ్లలో 32 రెట్లు పెరిగిన సౌరశక్తి సామర్థ్యం
తొలి అంతర్జాతీయ సోలార్‌ ఫెస్టివల్‌ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచమంతా ఈరోజు సూర్యుడి ప్రభావాన్ని మననం చేసుకుంటూ మెరుగైన భూమండలం కోసం ప్రతిఒక్కరినీ ఈరోజు ప్రేరేపిస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. గత పదేండ్లలో దేశం గ్రీన్‌ ఎనర్జీలో ఎంతో పురోగతి సాధించిందని గుర్తుచేశారు. పదేండ్లలో దేశ సౌరశక్తి సామర్ధ్యం 32 రెట్లు పెరిగిందని చెప్పారు.

ఈ వేగం, విస్తృతితో భారత్‌ 2030 నాటికి 500 గిగావాట్ల నాన్‌ ఫాసిల్‌ సామర్ధ్యాన్ని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వేదాల్లో నిక్షిప్తమైన మంత్రాల్లో అత్యంత ప్రముఖమైనవి సూర్యుడి గురించి ప్రస్తుతించినవి ఉన్నాయని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయులు ఈ మంత్రాన్ని పఠిస్తారని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతులు సూర్యుడిని వారి వారి పద్ధతుల్లో గౌరవిస్తాయని చెప్పారు. పునరుత్పాదన ఇంధనలో ప్యారిస్ ఆశయాలను సాధించిన తొలి జీ20 దేశం భారత్‌ అని తెలిపారు. సౌర శక్తి రంగంలో తిరుగులేని వృద్ధితోనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. 

సౌరశక్తిని ప్రోత్సహించేందుకు తాము కొద్దినెలల కిందట ప్రధానమంత్రి సూర్యఘర్‌ ముఫ్తి బిల్‌ యోజనను ప్రారంభించామని తెలిపారు. ఈ పధకం కోసం ప్రభుత్వం రూ. 75,000 కోట్లు వెచ్చిస్తోందని చెప్పారు. ఈ పధకంలో భాగంగా కోటి మంది గృహస్ధులు తమ ఇంటి పైకప్పుపై సోలార్‌ ప్యానెళ్లను అమర్చుకునేందుకు ఊతమిస్తామని తెలిపారు.