తెలుగు రాష్ట్రాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున వెంక‌య్య నాయుడు స‌హాయం

తెలుగు రాష్ట్రాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున వెంక‌య్య నాయుడు స‌హాయం
రెండు తెలుగు రాష్ట్రాలను వ‌ర‌ద‌లు ముంచెత్తి అపార నష్టం కలిగించడంపై మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ. 5 లక్షల చొప్పున సహాయం అంద‌జేస్తున్న‌ట్లు వెంక‌య్య నాయుడు ప్ర‌క‌టించారు. కుండపోత వర్షాలు, ఉదృతమైన వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాటిల్లుతున్న నష్టం త‌న‌ను తీవ్రంగా కలచివేసింది అని వెంక‌య్య నాయుడు పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని వివరించి, వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాను.  రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడానని, అక్కడి ప్రభుత్వాల యంత్రాంగాలతో, కేంద్ర అధికారులు టచ్‌లో ఉన్నారని ప్రధానమంత్రి చెప్పారు. రెండు రాష్ట్రాలకు తగిన సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారని మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి తెలిపారు.

తన వంతు సహకారంగా తన వ్యక్తిగత పెన్షన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో రూ.5 లక్షలు సహాయ చర్యల నిమిత్తం పంపించాను. ఈ కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 

యువత కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, తన కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు అందజేశారు.

అదే విధంగా తన కుమార్తె దీపా వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు అందజేసిన‌ట్లు వెంక‌య్య నాయుడు తెలిపారు.