ఛత్తీస్‌గఢ్‌లో 10 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో 10 మంది మావోయిస్టులు హతం
ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. బీజాపూర్‌ – దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు.   లావాపురంగేల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్ట్‌లకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. 
 
ఆ ప్రాంతంలో మావోయిస్ట్‌ల కోసం సీఆర్పీఎఫ్, డీఆర్జీ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడిన నక్సల్స్.. ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భధ్రతా సిబ్బంది ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగి 10 మంది మావోయిస్ట్‌లు చనిపోయారు. 
 
ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మృతి చెందిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.‘దంతెవాడ – బీజాపూర్‌ జిల్లా సరిహద్దు ప్రాంతంలో వెస్ట్‌ బస్తర్‌ డివిజన్‌కు చెందని మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం అందింది. పోలీసులు అర్ధరాత్రి ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో మావోలు – పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్‌ కొనసాగుతోంది’ అని దంతెవాడ పోలీసులు తెలిపారు.

దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ మాట్లాడుతూ ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 303 రైఫల్స్, 315 బోర్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా సిబ్బంది అంతా సురక్షితంగానే ఉన్నారని ఆయన అన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ జరుగుతోందన్న ఎస్పీ… పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఆగస్టు 29వ తేదీన కూడా నారాయణపుర్‌ జిల్లా అబూజ్‌మాడ్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టు దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ఘటనలో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో 150 మందికి పైగా మావోయిస్టులు మరణించారని పోలీసులు వెల్లడించారు.

కాగా, ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి దేశాన్ని వామపక్ష తీవ్రవాద రహితంగా మారుస్తామని ప్రకటించారు. మావోయిస్ట్‌ తీవ్రవాదులపై తుది దాడికి నిర్ణాయక, కఠిన వ్యూహం అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. హింసావాదాన్ని వీడాలని, లొంగుబాట పట్టిన నక్సల్స్‌ పునరావాసం కోసం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఒకట్రెండు నెలల్లో కొత్త విధానాన్ని ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. 2004-14 వ్యవధితో పోలిస్తే 2014-24 మధ్యకాలంలో నక్సల్స్‌ సంబంధిత ఘటనల్లో 53 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్రమంత్రి తెలిపారు.