పట్టాలపైకి కొత్తగా మరో మూడు వందే భారత్ రైళ్లు

పట్టాలపైకి కొత్తగా మరో మూడు వందే భారత్ రైళ్లు
దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైలు సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 51 రైళ్లు పట్టాలెక్కాయి. అవి వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.

సాధారణ రైళ్లల్లో ఇప్పటి వరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటంవల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి ప్రయాణికులు వందే భారత్‌ను ఆశ్రయిస్తున్నారు.

ఈ క్రమంలో కొత్తగా మరో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. అందులో చెన్నై-ఎగ్మూర్ నుంచి నాగర్ కోయిల్ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.

చెన్నై ఎగ్మూర్-నాగర్ కోయిల్ మధ్య దూరం 724 కిలో మీటర్లు. ఈ దూరాన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తొమ్మిది గంటల వ్యవధిలో చేరుకుంటుంది. ఈ రైలుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే రైల్వే అధికారులు విడుదల చేశారు. తెల్లవారు జామున 5 గంటలకు ఎగ్మూర్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్.. 5:23 నిమిషాలకు తాంబరం చేరుకుంటుంది. 

విల్లుపురం- 6:52, తిరుచ్చి- ఉదయం 8:55, దిండిగల్- 9:53, మధురై- 10:38, కోవిల్‌పట్టి- 11:35, తిరునెల్వేలి- మధ్యాహ్నం 12:30, నాగర్ కోయిల్- 1:50 నిమిషాలకు చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2: 20 నిమిషాలకు మళ్లీ ఎగ్మూర్‌కు తిరుగుముఖం పడుతుందీ రైలు. తిరునెల్వేలి- 3:18, కోవిల్‌పట్టి- 3:58, మధురై- సాయంత్రం 5:03, దిండిగల్- 5:48, తిరుచ్చి- 6:45, విల్లుపురం- రాత్రి: 8:53, తాంబరం-10:28, ఎగ్మూర్- 11 గంటలకు చేరుకుంటుంది.

ఈ రైలుతోపాటే మధురై- బెంగళూరు కంటోన్మెంట్‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోదీ ప్రారంభిస్తారు. మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజులు తెల్లవారు జామున 5: 15 నిమిషాలకు మధురై నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం ఒంటిగంటకు బెంగళూరు కంటోన్మెంట్‌కు చేరుకుంటుంది.  తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1:30 నిమిషాలకు బెంగళూరు కంటోన్మెంట్ నుంచి బయలుదేరి రాత్రి 9:45 నిమిషాలకు మధురై చేరుకుంటుంది. దిండిగల్, తిరుచ్చి, కరూర్, నమక్కల్, సేలం, కృష్ణరాజపురం మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.