అక్టోబర్లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పది రోజుల పాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలతో పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను అక్టోబర్4వ తేదీ నుంచి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీటీడీ ఈవో వెంకయ్య చౌదరి అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మత్సవాల సందర్భంగా తిరుమలలో అధిక రద్దీ ఉంటుంది. భక్తులు సాధారణ రోజులకంటే రెట్టింపు సంఖ్యలో వస్తారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు స్వీకరించరు.
పది రోజుల పాటు భక్తులంతా సర్వదర్శనం క్యూలైన్లోనే శ్రీవారిని దర్శనం చేసుకోవల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వీవీఐపీలు స్వయంగా వస్తే మాత్రం వారికి ప్రోటోకాల్ ప్రకారం దర్శనం కల్పిస్తారు. అక్టోబర్4న ధ్వజారోహణతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 8వ తేదీన గరుడసేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం నిర్వహిస్తారు.
ధ్వజరోహణ సందర్భంగా ధ్వజస్తంభంపై గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. వేద పండితులు మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీశాఖ 2 వారాల ముందు నుంచే కసరత్తు చేస్తుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు ఉంటాయి.

More Stories
కర్నూలు బస్సు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం
అమరావతికి ప్రపంచ బ్యాంకు మరో రూ 1700 కోట్లు