
చంద్రుడిపై అన్వేషణలో భాగంగా అనేక ప్రయోగాలు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో, అక్కడ నుంచి రాళ్లు, మట్టి తీసుకువచ్చే లక్ష్యంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 డిజైన్లు పూర్తైనట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తాజాగా వెల్లడించారు.
ప్రస్తుతం ఇవి కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు మీడియాకు చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఇస్రో దాదాపు 70 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనుందని తెలిపారు.
“చంద్రుడిపై అన్వేషణ కోసం వరుస ప్రయోగాలు చేపడుతున్నాం. ఇప్పటికే చంద్రయాన్ 3 పూర్తయ్యింది. చంద్రయాన్ 4, 5 డిజైన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయి. రానున్న కాలంలో ఇస్రో మొత్తంగా 70 శాటిలైట్ ప్రయోగాలు చేపట్టనుంది” అని చెప్పారు. ఇందులో వివిధ శాఖల అవసరాల కోసం తక్కువ ఎత్తులో చేపట్టే నావిక్ ఇన్ శాట్ 4డి, రిసోర్స్శాట్, కార్టోశాట్ వంటి ప్రయోగాలు ఉన్నాయని ఇస్రో ఛైర్మన్ పేర్కొన్నారు. శుక్ర గ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్ను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు.
మరోవైపు, మానవ రహిత గగన్యాన్ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబరులో చేపట్టే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి అన్ని విభాగాల రాకెట్లు శ్రీహరి కోటకు ఇప్పటికే చేరుకున్నాయని చెప్పారు. మరోవైపు చంద్రయాన్ 4 మిషన్ 2028లో చేపట్టే అవకాశం ఉన్నట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు.
ఇటీవల పునర్వినియోగ వాహక నౌక పుష్పక్ను వరుసగా మూడోసారి ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ప్రతికూల పరిస్థితుల మధ్య నిర్వహించిన ప్రయోగంలో స్వయంప్రతిపత్తిగల ల్యాండింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు ఇస్రో పేర్కొంది.
అంతరిక్షం నుంచి వచ్చిన నౌక కోసం అప్రోచ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్, హై స్పీడ్ ల్యాండింగ్ పరిస్థితులను సిమ్యులేట్ చేయడం ద్వారా పుష్పక్ అభివృద్ధికి అవసరమైన అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించినట్లు తెలిపింది. కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో పుష్పక్కు సంబంధించిన చివరి పరీక్ష ఇదేనని వివరించింది.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం