
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్లో న్యూస్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అలీ ఖాన్లతో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీ కావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ కావడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ఎమ్మెల్సీ తనకు పదవి కాదని, సేవ అని పేర్కొన్నారు.
అమరుల ఆకాంక్షలు నెరవేర్చడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అందరం కలిసి పని చేయడం ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపామని పేర్కొన్నారు. తనకు చేతనైన కాడికి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేందుకు పని చేస్తానని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. తానేమీ కత్తి పెట్టి బెదిరించి ఎమ్మెల్సీ తీసుకోలేదని స్పష్టం చేశారు.
అధికారం అనుభవించడానికి తాను ఎమ్మెల్సీ కాలేదని.. ఇది ఒక కొత్త అనుభవం అని పేర్కొన్నారు. ఇప్పుడున్న యంత్రాంగంలో చేరి ఎలా పని చేయాలో ఆలోచిస్తున్నానని చెప్పారు.
ఇక తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి అమీర్ అలీ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేలా కృషి చేస్తానని తెలిపారు. కాగా, ప్రొఫెసర్ కోదండరాంను విద్యావేత్తల కోటాలో, అమీర్ అలీ ఖాన్ను జర్నలిస్టుల కోటాలో మండలి సభ్యులుగా ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలుపడంతో శుక్రవారం నాడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకార చేశారు.
ఆయనతో పాటు సియాసత్ ఉర్దూ దిన పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ మీర్ ఆమేర్ అలీఖాన్ను కూడా సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. గవర్నర్ కార్యాలయం గురువారం ఈ మేరకు ప్రకటన చేసింది.
ప్రొఫెసర్ కోదండరాంను విద్యావేత్తల కోటాలో, ఆమేర్ అలీఖాన్ను జర్నలిస్టుల కోటాలో మండలి సభ్యులుగా ప్రభుత్వం సిఫారసు చేసింది. గత ప్రభుత్వం దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా, వారి రాజకీయ నేపథ్యం కారణంగా ఆ ప్రతిపాదనను తమిళిసై తిరస్కరించిన విషయం విదితమే. ప్రస్తుతం వీరి స్థానంలోనే కోదండరాం, మీర్ ఆమేర్ అలీ ఖాన్ను నియమించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి