పోలవరం కొత్త డయాఫ్రం వాల్​కు కేంద్రం సుముఖత

పోలవరం కొత్త డయాఫ్రం వాల్​కు కేంద్రం సుముఖత
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో శుక్రవారం సాయన్తరం సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు.

పోలవరం పనుల వేగవంతంపై కేంద్రమంత్రితో చర్చించామని, పోలవరం డయాఫ్రమ్ వాల్‌పై కేంద్ర మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ధ్వంసమైన డయాఫ్రమ్‌ వాల్‌ స్థానంలో కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. 2022లో టెండర్ దక్కించుకున్న ఏజన్సీకే ఇవ్వాలని నిర్ణయించారని, పోలవరం పనులు వేగంగా జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

2022లో టెండర్ ఖరారు చేసిన ధరలకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.  కొట్టుకుపోయిన డయాఫ్రం వాల్‌ మరమ్మతుల కోసం 2022లో 29 వేల స్వ్కేల్‌ మీటర్ల నిర్మాణానికి రూ.390 కోట్లుకు టెండర్‌ వేసిన కంపెనీకే 73 వేల స్వ్కేల్‌ మీటర్ల నిర్మాణ బాధ్యతను అదే ధరలకు అప్పగిస్తామని చెప్పారు. 

పోలవరం నిర్మాణం జాప్యం వల్ల ధరలు పెరిగి వ్యయం పెరగుతుందని, నిర్మాణ జాప్యం తగ్గించేందుకు తీసుకున్న చర్యలపై చర్చించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఒకే సంస్థతో కొనసాగిస్తే మంచిదని, భారం తగ్గడంతో పాటు పనులు చేపట్టిన ఏజెన్సీకి బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. ఏజన్సీలను మార్చుతూ పోతే నిర్మాణం ఆలస్యమవుతుందని తెలిపారు. 

గత ప్రభుత్వం ఏజన్సీని మార్చడం వల్ల పనులు ఆలస్యమైందని, రివర్స్ టెండర్ల వల్లే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం పనులు, అభివృద్ధి విధ్వంసం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో నిధులు విడుదలజేసి పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు.

కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి శనివారం భేటీ కానున్నారు.  ఆ తర్వాత హోం, ఆర్థికశాఖ మంత్రులతో విడివిడిగా సమావేశమవుతారు. కేంద్ర బడ్జెట్‌ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.