సిద్దిపేట లో అర్ధరాత్రి హరీశ్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడి

సిద్దిపేట లో అర్ధరాత్రి హరీశ్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడి
బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అధికార నివాసం (ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్) పై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తాళాలు పగులగొట్టి పలు వస్తువులను ధ్వంసం చేశారు. క్యాంప్‌ ఆఫీస్ వద్ద ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. దాడి చేసేందుకు వచ్చిన వారు  జై కాంగ్రెస్‌, జైజై కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు. 

రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే వచ్చిన వారిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రావడంతో హరీష్‌ ఆఫీస్‌ దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను బయటకు పంపించేశారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ గుండాలు క్యాంప్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అర్ధరాత్రి దాడి చేయడాన్ని చూస్తే తీవ్ర ఆందోళనలను రేకెతుస్తోందని ఓ వీడియోను పోస్టు చేశారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇలా దాడి చేస్తే  సామాన్యలు భద్రతకు ప్రభుత్వం ఏం భరోసా ఉంటుందని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హరీశ్ రావు స్పష్టం చేశారు.

“ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణం. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం.. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం. వెంటనే ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలి” అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

 
హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ గూండాల దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. సీనియర్‌ ఎమ్మెల్యేకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని ప్రశ్నించారు. గత పదేండ్లలో ఇలాంటి కక్ష సాధింపులు లేవని, ఇప్పుడు పోలీసుల సహకారంతో కాంగ్రెస్‌ పార్టీ నీచంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని.. సరైన సమాధానం చెబుతారని ఎక్స్‌ వేదికగా హెచ్చరించారు.