దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన డాక్టర్లు

దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన డాక్టర్లు
కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల వైద్యులు సోమవారం నిరవధిక సమ్మెకు దిగారు.  ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎంపిక సేవలను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతో పాటు అనేక ఇతర నగరాల్లోని వైద్యులు ప్రకటన చేశారు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఆర్జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ రాజీనామా చేశారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న అవమానాన్ని తాను భరించలేకపోతున్నానని తెలిపారు. జూనియర్ డాక్టర్​ హత్యాచార ఘటన తర్వాత మృతురాలి పరువుకు భంగం కలిగించేలా ప్రిన్సిపల్‌ మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన రాజీనామా చేయాలంటూ కాలేజీ వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో పదవి నుంచి వైదొలిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘నా పేరుతో రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. నా వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న అవమానాన్ని భరించలేకపోతున్నా. నన్ను తొలగించేందుకే కొందరు కుట్రపన్ని విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. నిందితులకు శిక్ష పడాలని కోరుతున్నాను. చనిపోయిన అమ్మాయి నా కూతురు లాంటిది. నేను కూడా ఓ పేరెంట్‌నే.. పేరెంట్‌గానే రిజైన్‌ చేస్తున్నాను’ అని డాక్టర్‌ ఘోష్‌ తెలిపారు. 

తాను ఓ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ని అని జీవనోపాధి పొందగలనని ఈ సందర్భంగా ఘోష్‌ పేర్కొన్నారు. ‘సందీప్‌ ఘోష్‌ రాజీనామా చేయలేరని అందరూ అనుకున్నారు. నేను నిజాయితీ పరుడిని. ఈ బాధ్యతలు చేపట్టాక అవినీతిని అరికట్టాను. ఆసుపత్రి అభివృద్ధికి, రోగుల ప్రయోజనాలకు ఎంతో కృషి చేశాను’ అని చెప్పారు.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ డాక్టర్‌ శవ పరీక్ష నివేదిక వెలువడింది. ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు అది నిర్ధారించింది. ఈ కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  అతడిని సెల్దా కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల పోలీస్‌ రిమాండ్‌కు ఆదేశించింది.