కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ

కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ కోర్టులో తాను దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కె కవిత ఉపసంహరించుకున్నారు. నిజానికి ఈ పిటిషన్ దాఖలు చేశారు కానీ వాదనలు వినిపించలేదు. పదే పదే వాయిదాలు కోరారు. సోమవారం కూడా ఈ పిటిషన్‌పై రౌస్ అవెవ్యూ కోర్టు విచారణ జరిపింది.  అయితే సీనియర్ లాయర్లు రానందున కేసు వాయిదా వేయాలని కవిత తరపు లాయర్లు కోరారు.

దీంతో న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఎట్టి పరిస్థితుల్లోనూ వాదనలు వినిపించాలని స్పష్టం చేశారు. అయితే మంగళవారమే పిటిషన్ ఉపసంహరించుకుంటామని కవిత లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు కూడా అంగీకరించింది. కవిత హఠాత్తుగా డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవడం ఆసక్తికరంగా మారింది. సిబిఐ చార్జిషీటులో లోపాలు ఉన్నాయని కవిత ప్రధానగా ఈ డీఫాల్ట్ బెయిల్ పిటి,న్ దాఖలు చేశారు. కానీ ఇటీవల సిబిఐ చార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

కోర్టే పరిగణనలోకి తీసుకున్నప్పుడు లోపాలు ఉంటాయని ఎలా అంటారని న్యాయస్థానం ప్రశ్నించి పిటిషన్‌ను డిస్మిస్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆమె తరపు లాయర్లు అనకోవడం వల్లనే ఈ పిటిషన్ ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది. తర్వాత అసలు బెయిల్ పిటిషన్‌పై వాదనల్లో ప్రభావం చూపకుండా ఉపసంహరించుకోవడమే మంచిదని అనుకున్నారని అంచనా వేస్తున్నారు.

మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇడి అధికారులు కవితను మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఆమె ఇడి కస్టడీలో ఉన్నారు. ఆపై ఆమెను తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. అనంతరం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉంటున్నారు.

మంగళ వారం తీహార్ జైల్లో ఉన్న కవితతో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కెటిఆర్, హరీష్‌రావులు ములాఖత్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు పూర్తయిందని ఇటీవలే సిబిఐ కోర్టుకు తెలిపింది. ఇప్పుడు దర్యాప్తు పూర్తయినందున ఇక తనకు బెయిల్ ఇవ్వాలని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండదని పూర్తి స్థాయి బెయిల్ కోసం ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

అయితే కవిత అటు ఇడి, ఇటు సిబిఐ కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంది. అలా అయితేనే ఆమె బయటకు రాగలరు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇడి కేసులో బెయిల్ వచ్చింది కానీ సిబిఐ కేసులో ఇంకా రాలేదు.