గాడితప్పిన పాలనను సరిదిద్దేందుకు పనిచేయాలి

గాడితప్పిన పాలనను సరిదిద్దేందుకు పనిచేయాలి
గాడి తప్పిన పాలనను సరిదిద్దడానికి అధికారులు, ఉద్యోగులు అంతా ఒకే వేవ్ లెంగ్త్‌లో పనిచేయడానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు విధిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ సమిష్టిగా ముందుకు వెళ్లేలా నడుస్తున్నట్టు చెప్పారు.

ఐదేళ్లకు ముందు అధికారంలోకి వచ్చినాయన ప్రజావేదికలో కలెక్టర్లకాన్ఫరెన్స్ పెట్టి, కాన్ఫరెన్స్‌ అయిన వెంటనే దానిని కూల్చేస్తామని చెప్పి, ప్రకటన తర్వాత విధ్వంసానికి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని రంగాల్లో విధ్వంసం తప్పలేదని చెబుతూ  విధ్వంసం, అధికారుల్ని బెదిరించి పనిచేయించడం జరిగిందని, ఐదేళ్లలలో అధికారుల మనోభావాలను దెబ్బతీసారని తెలిపారు.

ఒకప్పుడు ఆంధ్రా బ్యూరోక్రసి అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేదని, ఇక్కడి నుంచి వెళ్లే వారికి కేంద్రంలో కీలక స్థానాలు దక్కేవని, అయితే ఇప్పుడు ఆంధ్రా అధికారులంటే అన్‌ అంటరాని వారయ్యారని, వీళ్లేమి చేయలేరనే భావన వచ్చిందని చెప్పారు. రాష్ట్రమంతటా జరిగిన విధ్వంసాన్ని సరిచేయాలంటే అదనపు శ్రమ చేయాలని సూచించారు.

మూడు నెలల్లో మరో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెబుతూ గంటల తరబడి నిర్వహించనని హామీ ఇచ్చారు. కలెక్టర్లకు పనిచేయకపోతే గ్యారంటీ ఉండదని, ఉపేక్షించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. సమర్థవంతంగా పనిచేయాలని, కలెక్టర్లు అంతా తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ సమస్యనైనా మానవత ధృక్పథంతో వ్యవహరించాలని, ఆ దిశగా కలెక్టర్లు పనిచేయాలని చెప్పారు.

ప్రతినెల 10వ తేదీన `పేదల సేవ’లో అనే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్లకు చంద్రబాబు పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో రూ.2.70లక్షల కోట్లను ప్రజలకు పంచినా ఏనాడు ప్రజల వద్దకు వెళ్లలేదని, సభలు పెట్టినా బలవంతంగా వారిని తెచ్చే పరిస్థితి ఉండేదని చెబుతూ ఆ పరిస్థితిలో మార్పు రావాల్సి ఉందని కోరారు. నిబంధనల చట్రంలో ఇరుక్కోకుండా మానవతా ధృక్పథంలో పనిచేయాల్సి ఉందని చెప్పారు. 

గుజరాత్ తరహాలో రాష్ట్రంలో మరింత కఠినమైన చట్టాలు చేయాలని, పేదవాడికి అన్యాయం చేయాలంటే భయపేలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తామని రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. బలమైన వ్యవస్థను గత ప్రభుత్వం ఆటబొమ్మగా మార్చేసిందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ విమర్శించారు.  ఉమ్మడి ఏపీ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఏపీకి ప్రత్యేక గుర్తింపు ఉండేదని గుర్తు చేశారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎలా ఉండాలో బ్యూరోక్రాట్లకు రోల్ మోడల్‌గా ఉండేదని, ఇప్పుడు ఎలా ఉండకూడదు అనడానికి రోల్‌ మోడల్‌గా మారిందని చెప్పారు.