భారత్​లో చైనా పెట్టుబడులను పెంచేందుకు కసరత్తు

భారత్​లో చైనా పెట్టుబడులను పెంచేందుకు కసరత్తు
* ‘మేకిన్ ఇండియా’కు ప్రమాదం?
2020 సరిహద్దు వివాదం అనంతరం భారత్​లో గణనీయంగా తగ్గిన చైనా  పెట్టుబడులను పెంచేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తున్నది.   భద్రతాపరమైన ముప్పు కలిగించకుండా పనిచేసే కంపెనీలకు సంబంధించి కేంద్రం ఒక జాబితాను తయారు చేస్తోందని, అది పూర్తైన తర్వాత ఆయా సంస్థలకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
 
పొరుగు దేశాలకు వర్తించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్​డీఐ) రెగ్యులేషన్​లోని ప్రెస్ నోట్ -3 ప్రకారం అదనపు పరిశీలన లేకుండా ఈ రంగాల్లో పెట్టుబడులను కేంద్రం అనుమతించవచ్చని వివరించాయి. 2020 లో భారత్​- చైనా మధ్య సరిహద్దు వివాదం మొదలైనప్పటి నుంచి ప్రెస్ నోట్ -3 అమల్లో ఉంది. దీని ప్రకారం భారతదేశంతో భూ సరిహద్దులు ఉన్న దేశాల నుండి పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ అనుమతిని పొందడం తప్పనిసరి. 
 
ఫలితంగా దిగుమతులు ఊపందుకున్నప్పటికీ ఈ నియంత్రణ తర్వాత చైనా నుంచి పెట్టుబడులు తగ్గిపోయాయి. ”ఈ ఆలోచనపై కసరత్తు జరుగుతోంది. కానీ, ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు” అని ఓ అధికారి మీడియాకు తెలిపారు. ” చైనా నుంచి భద్రతా ముప్పు నిరంతరం ఉంది. అది తొలగిపోలేదు. కానీ భద్రతాపరమైన ముప్పు లేని కొన్ని పరిశ్రమలు / రంగాలు ఉన్నాయి. చైనా నుంచి పెట్టుబడులను స్వీకరించడంతో మన ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది,” అని ఆ అధికారి పేర్కొన్నారు.

చైనాపై అమల్లో ఉన్న నియంత్రణను సమీక్షించడంపై చర్చలు జరపాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఈ విషయాన్ని పరిశీలిస్తోందని తెలుస్తున్నది. సంబంధిత వర్గాల ప్రకారం ఒకవేళ ఈ ఆలోచన కార్యరూపం దాల్చితే, కేంద్ర హోంశాఖతో డీపీఐఐటీ కసరత్తులు మెదలుపెడుతుంది. 

చైనా నుంచి నైపుణ్యం కలిగిన మానవ వనరులకు వీసాలపై ఆంక్షల కారణంగా తాము సాంకేతిక, ఇతర సవాళ్లను ఎదుర్కొంటున్నామని, ఎఫ్ డీఐ విధానాన్ని సడలించాలని దేశీయ పరిశ్రమ, ముఖ్యంగా చైనా ప్లాంట్లు, పరికరాలను ఉపయోగించే వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చైనా పెట్టుబడులు రాకపోవడం వల్ల దేశ సొంత తయారీ రంగంపై ప్రభావం పడుతోందని ఆయన కంపెనీలు చెబుతున్నాయి.

గత వారం విడుదల చేసిన తాజా ఆర్ధిక సర్వేఎగుమతులను పెంచడానికి భారతదేశం తన ఉత్తరాన ఉన్న పొరుగు దేశం నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అయితే,  కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే దేశీయ సంస్థలకు నష్టం కలగొచ్చు అన్న వాదనలు కూడా ఉన్నాయి. ‘మేకిన్ ఇండియా’కు చైనా కంపెనీలను అనుమతించడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉందని, కీలకమైన సరఫరాలు, ఆర్థిక వృద్ధి కోసం దేశీయ సంస్థలు చైనా కంపెనీలపై ఆధారపడాల్సి వస్తుందని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

“చైనా కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టడం, పాశ్చాత్య మార్కెట్లకు ఎగుమతి చేయడం స్వల్పకాలంలో ప్రయోజనకరంగా అనిపించినప్పటికీ, ఇది భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కీలక ఉత్పాదక సామర్థ్యాల కోసం చైనా సంస్థలపై ఆధారపడటం వల్ల సరఫరా గొలుసు బలహీనతలు, భౌగోళిక భౌగోళిక ప్రమాదాలకు భారత్ గురవుతుంది,” అని గ్లోబల్​ ట్రేడ్​ రసెర్చ్​ ఇనీషియేటివ్​ ఫౌండర్​ అజయ్​ శ్రీవాస్తవ హెచ్చరించారు.