విపక్షాల్లో నాయకత్వ పోరుతో నీతి ఆయోగ్‌ ఉదంతం

విపక్షాల్లో నాయకత్వ పోరుతో నీతి ఆయోగ్‌ ఉదంతం
నీతి ఆయోగ్‌ భేటీలో తనను మాట్లాడేందుకు అనుమతించలేదని, తాను మాట్లాడుతుండగా మైక్‌ కట్‌ చేశారని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. విపక్షంలో నాయకత్వం కోసం పోటీ మొదలైందని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది పేర్కొన్నారు. 
 
నీతి ఆయోగ్‌ భేటీకి విపక్ష ముఖ్యమంత్రులు హాజరు కారని కాంగ్రెస్‌ ప్రకటించిన క్రమంలో మీడియా దృష్టిని ఆకర్షించేందుకే మమతా బెనర్జీ ఢిల్లీ చేరుకున్నారని ఆమె ఆరోపించారు.  కాంగ్రెస్ నిర్ణయాన్ని గుడ్డిగా అనుసరించబోననే సంకేతాలు పంపుతూ తాను స్వతంత్రంగా వ్యవహరిస్తానని చాటేందుకే ఆమె నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరయ్యారని ఆయన చెప్పారు. 
 
కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా తాను ఫోకస్‌ కావాలని ఆమె కోరుకుంటారని చెప్పారు. మమతా బెనర్జీ మైక్‌ను స్విచాఫ్‌ చేయలేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే స్పష్టం చేశారని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ ఎదుగుదలతో ప్రాంతీయ పార్టీల భవితవ్యం గురించి మమతా బెనర్జీ ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు.కాగా, నీతి ఆయోగ్‌ సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని అవమానించిన తీరు అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ విచారం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో విపక్ష నేతల మైక్‌ కట్‌ చేయడం ఇప్పటివరకూ చూశామని, ఇక నీతి ఆయోగ్‌ సమావేశంలోనూ సీఎంల మైక్‌లు కట్‌ చేయడం వరకూ కాషాయ పాలకులు వెళ్లడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.