ఒలంపిక్స్ 2024.. క్వార్టర్ ఫైనల్లో భారత ఆర్చరీ జట్లు

ఒలంపిక్స్ 2024.. క్వార్టర్ ఫైనల్లో భారత ఆర్చరీ జట్లు

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడలు (ఒలింపిక్స్)లో భారత్ క్రీడల ఆరంభానికి ముందే అదరగొట్టింది. గురువారం జరిగిన ఆర్చరీ పోటీల్లో భారత పురుషులు, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. పురుషుల ర్యాంకింగ్ రౌండ్‌లో భారత్ 2013 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుది.

భారత్ విజయంలో విజయవాడ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ కీలక పాత్ర పోషించాడు. ధీరజ్ అసాధారణ ప్రతిభను కనబరిచాడు. 681 పాయింట్లతో వ్యక్తిగత రౌండ్‌లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. తరుణ్‌దీప్ రాయ్ 674 పాయింట్లు సాధించి తనవంతు పాత్ర పోషించాడు. 

ప్రవీణ్ జాదవ్ 658 పాయింట్లు సాధించి సత్తా చాటాడు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ 1347 పాయింట్లు సాధించి రౌండ్ ఆఫ్16లోకి ప్రవేశించింది. టాప్‌లో నిలిచిన ధీరజ్, అంతిక భకత్ భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. అంతకుముందు మహిళల టీమ్ విభాగంలో కూడా భారత్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. 

గురువారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచి నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సాధించింది. భారత్ టీమ్ ఈవెంట్‌లో 1983 పాయింట్లను సాధించింది. అంకిత భకత్ (666), భజన్ కౌర్ (658), దీపిక కుమార్ (658) పాయింట్లు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

కాగా, యావత్‌ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశ్వ క్రీడల పండుగ  ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ వేదికగా 33వ ఒలింపిక్‌ క్రీడలు శుక్రవారం నుంచి జరగనున్నాయి. ప్రారంభోత్సవ వేడుకలు పారిస్‌లోని సీన్‌ నది వెంబడి జరగనున్నాయి. అథ్లెట్లు ఒలింపిక్స్‌ విలేజ్‌కు చేరుకోవడానికి పడవలు, బల్లకట్టు వంటివి ఉపయోగిస్తున్నారు. 

వేసవి క్రీడల చరిత్రలో తొలిసారి ప్రారంభోత్సవ వేడుకలు స్టేడియం బయట జరగడం ఇదే తొలిసారి. క్రీడల ప్రారంభోత్సవానికి మూడురోజుల ముందునుంచే పారిస్‌కు అథ్లెట్ల తాకిడి మొదలైంది. ప్రారంభోత్సవాల సందర్భంగా సీన్‌ నదిని సుందరంగా ముస్తాబు చేశారు. ప్రారంభోత్సవాల్లో ఫ్రెంచ్‌ సంస్కృతీ సాంప్రదాయాలతో పాటు కనులు మిరుమిట్లు గొలిపే లేజర్‌ షోలను ప్రదర్శించనున్నారు.

 పోటీలు ముమ్మరమయ్యే సమయానికి 14,500మంది అథ్లెట్లు రావొచ్చని నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారుల వసతికోసం 40 హౌసింగ్‌ బ్లాక్‌లను ప్రత్యేకంగా నిర్మించారు. భారత్‌ నుంచి ఈసారి 117మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. టేబుల్‌ టెన్నిస్‌(టిటి) ఆటగాడు శరత్‌ కమల్‌ భారత త్రివర్ణ పతాకాన్ని చేబూని అథ్లెట్ల బృందం ముందు నడవనున్నాడు. 

2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ 1స్వర్ణ, 2రజత, 4కాంస్యాలు సాధించగా.. ఈసారి రెండంకెల పతకాల సాధనే లక్ష్యంగా భారత్‌ బరిలోకి దిగుతోంది. గత ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించి 41ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.