
కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చేలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. తాము పెట్టిన ప్రతిపాదనలు చాలా వరకూ ఆమోదించారని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణానికి పెద్దమొత్తంలో నిధులు ఇవ్వడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, దీని వల్ల రాష్ట్రానికి పన్నుల రూపేణా ఆదాయం పెరుగుతుందని వివరించారు.
నిధులు ఏ రూపేణా వచ్చినా, అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగమని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఎంతో కూరుకుపోయి ఉందన్న చంద్రబాబు, అందుకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించారు. రాజధాని నిర్మాణం బండి వేగం పుంజుకోవాలంటే ఈ నిధులు ఎంతో ఉపకరిస్తాయని పేర్కొన్నారు.
వివిధ ఏజన్సీల ద్వారా వచ్చే నిధులు కొన్ని అప్పు రూపేణా అయినా, దాదాపు 30ఏళ్ల తర్వాతే తీర్చేదన్న సీఎం, అది అప్పటికి అంత భారమేమీ కాదని చెప్పారు. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం తన పూచీకత్తుతో ఇస్తుందనీ, మరికొంత గ్రాంట్ కూడా కలిసి ఉంటుందని తెలిపారు. వచ్చే నిధుల్లో కొంత కేంద్ర గ్రాంట్ కూడా కాపిటల్ అసిస్టేన్స్ రూపేణా కలుస్తుందన్న ముఖ్యమంత్రి అది లాభమేనని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు ఇంత మేర నిధులు అని పెట్టకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం చెప్పటం మనకి చాలు కదా అని వ్యాఖ్యానించారు. వెనకబడిన జిల్లాలకు ఇచ్చే సాయం బుందేల్ ఖండ్ ప్యాకేజీ తరహాలో ఉంటుందని తమకు సమాచారముందన్న చంద్రబాబు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
పారిశ్రామిక రాయితీలు కూడా ఈ ప్యాకేజీలో భాగంగా వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఇందులో నియమ నిబంధనలు పరిశీలించాక మనకు అనుకూలంగా వాటిని మల్చుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చటం ప్రకాశం జిల్లాకు ఎంతో ఉపయోగమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వరాల జల్లు కురిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మన రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ను సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందించారు. ఏపీ మళ్లీ గాడిలో పడుతోందని చంద్రబాబు భరోసా వ్యక్తం చేశారు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం