ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరికొన్ని రోజులు తీహార్ జైలులోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 4 నెలలుగా తీహార్ జైలులోనే ఉంటున్న కవిత తనకు డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని వేసిన పిటిషన్పై విచారణను కోర్టు వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను ఆగస్టు 5 వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి అందులో కవిత పాత్రకు సంబంధించిన అభియోగాలతో కూడిన ఛార్జిషీట్ను సీబీఐ అధికారులు ఇప్పటికే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించారు.
తాజాగా ఆ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. అంతేకాకుండా జులై 26వ తేదీన కల్వకుంట్ల కవితను వర్చువల్గా కోర్టులో హాజరుపర్చాలని సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్కు సంబంధించిన కాపీలను నిందితుల తరఫు లాయర్లకు ఇవ్వాలని సీబీఐ అధికారులకు కోర్టు సూచించింది.
ఈ కేసులో కల్వకుంట్ల కవిత సహా మరో నలుగురి పాత్రపై జూన్ 7 వ తేదీన సీబీఐ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సీబీఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీట్పై కోర్టులో కవిత తరఫు లాయర్లు సందేహాలు వ్యక్తం చేశారు. 60 రోజుల గడువులోపల సీబీఐ అధికారులు పూర్తి స్థాయి ఛార్జ్షీట్ను దాఖలు చేయడంలో విఫలం అయ్యారని ఇదివరకే జులై 8 వ తేదీన కవిత లాయర్లు పిటిషన్ వేసి వాదనలు వినిపించారు. అంతేకాకుండా కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11 వ తేదీన అక్రమంగా అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు.
ఆ తర్వాత జూన్ 7 వ తేదీన అసంపూర్తిగా సీబీఐ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిందని విన్నవించారు. ఇదే సమయంలో ఆ ఛార్జిషీట్లో తప్పులు ఉన్నాయని కోర్టు కూడా పేర్కొనడం గమనార్హం. సీఆర్పీసీ 167(2) ప్రకారం కల్వకుంట్ల కవిత డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు ఉంటుందని,. 7 ఏళ్ల శిక్ష పడే కేసులో 60 రోజులు మాత్రమే కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉంటుందని కవిత లాయర్లు వాదించారు.
తాము డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జూలై 6 తేదీ నాటికి ఆమె కస్టడీ 86 రోజులు పూర్తైందని ఇప్పటికే వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రాగా ఆగస్టు 5కు వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కేసులు నమోదు చేసిన సీబీఐ, ఈడీ.. కవితను అదుపులోకి తీసుకున్నాయి.
అయితే అప్పటి నుంచి ఆమెకు బెయిల్ తీసుకువచ్చేందుకు లాయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ అవి విఫలం అవుతున్నాయి. తాజాగా కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ను విచారించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేయడంతో ఆమె మరికొంత కాలం జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
రాంగోపాల్ వర్మకు చెక్బౌన్స్ కేసులో జైలు శిక్ష!
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా