పాలస్తీనా ప్రత్యేక హోదాను తిరస్కరించిన ఇజ్రాయిల్ పార్లమెంట్

పాలస్తీనా ప్రత్యేక  హోదాను తిరస్కరించిన ఇజ్రాయిల్ పార్లమెంట్

ఇజ్రాయిల్‌ మరింత దూకుడుగా వ్యవహరించింది. పాలస్తీనా ప్రత్యేక  హోదాను  పూర్తిగా తిరస్కరించే తీర్మానాన్ని గురువారం ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌ ఆమోదించింది. ఈ తీర్మానానికి మద్దతుగా 68 మంది ఓటు వేయగా, తొమ్మిది మంది వ్యతిరేకించారు. 

పాలస్తీనా ప్రత్యేక హోదా   ఇజ్రాయిల్‌, ఆ దేశ ప్రజలకు అస్తిత్వ ప్రమాదం కలిగించవచ్చని, ఇజ్రాయిల్‌ -పాలస్తీనాల మధ్య యుద్ధాన్ని శాశ్వతం చేస్తుందని, ఈ ప్రాంతాన్ని అస్థిరపరుస్తుందని పేర్కొంది. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ మిత వాద పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతిపక్ష నేత యాయిర్‌ లాపిడ్‌కి చెందిన సెంటర్‌ లెఫ్ట్‌ పార్టీ ఈ సెషన్‌కు దూరంగా ఉంది.

పాలస్తీనియన్‌ నేషనల్‌ ఇన్షియేటివ్‌ (పిఎన్‌ఐ) ప్రధాన కార్యదర్శి ముస్తఫా బర్గౌతి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఖండించారు. ప్రభుత్వం, ప్రతిపక్షం నుండి ఏ జియోనిస్ట్‌ పార్టీ కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయలేదు అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ తీర్మానం పాలస్తీనియన్లతో శాంతిని తిరస్కరించడం మరియు ఓస్లో ఒప్పందం మరణానికి సంబంధించిన అధికారిక ప్రకటనను సూచిస్తుందని పేర్కొన్నారు.

1993లో పాలస్తీనా, ఇజ్రాయిల్‌ నేతల మధ్య మొదటిసారిగా సంతకం చేసిన ఓస్లో ఒప్పందాలు .. ఇజ్రాయిల్‌తో కలిసి జీవించగలిగే సార్వభౌమమైన పాలస్తీనా రాజ్యం కోసం పిలుపునిచ్చాయి. కానీ ఇజ్రాయిల్‌ ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌ మీదుగా పాలస్తీనా భూముల్లో అక్రమ నివాసాలను నిర్మించడం మరియు గాజాను పూర్తిగా దిగ్బంధఙంచడం వంటి చర్యలకు దిగుతోంది.