అస్సాంలో ఇప్పుడు ముస్లిం జనాభా 40 శాతం

అస్సాంలో ఇప్పుడు ముస్లిం జనాభా 40 శాతం
అస్సాంలో జనాభా నిష్పత్తి మారుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అస్సాంలో నేడు ముస్లిం జనాభా 40 శాతంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అస్సాంలో మత ఘర్షణలకు కారణం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనారిటీలే కారణమని ఆరోపించారు.   ‘‘రాష్ట్రంలో జనాభా నిష్పత్తి మారిపోతున్నఅంశం నాకో సమస్యగా తయారయింది. నేడు అస్సాంలో ముస్లింల జనాభా 40 శాతం. 1951లో 12 శాతం మాత్రమే ఉండేది. మనం చాలా జిల్లాలను పోగొట్టుకున్నాం. ఇది నాకు రాజకీయ అంశం కాదు. ఇది నాకు చావో రేవో వంటి సమస్య’’అని ఆయన చెప్పారు.
 
కాగా, జూలై 1న, శర్మ ఏ మతం గురించి ప్రస్తావించకుండానే ఓ ‘ప్రత్యేక మతం’   చెందిన ఒక వర్గం నేరపూరిత కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. “ఒక నిర్దిష్ట మతానికి చెందిన వ్యక్తులు మాత్రమే నేరాలకు పాల్పడతారని నేను చెప్పడం లేదు. కానీ ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల నుండి ఇటీవలి సంఘటనలు ఆందోళన కలిగించే విషయం” అని శర్మ పేర్కొన్నారు.
 
జూన్ 23న, బంగ్లాదేశ్ మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేశారని, రాష్ట్రంలో, కేంద్రం లోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులను పరిగణనలోకి తీసుకోలేదని శర్మ విచారం వ్యక్తం చేశారు. అస్సాంలో బంగ్లాదేశ్ మూలాలున్న మైనారిటీ కమ్యూనిటీ మాత్రమే మతతత్వానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
 
 లోక్‌సభ ఎన్నికల్లో, అస్సాంలోని 14 లోక్‌సభ స్థానాలకు గాను బిజెపి-ఎజిపి-యుపిపిఎల్ సంకీర్ణం 11 స్థానాలను గెలుచుకోగా, మిగిలిన మూడు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 24 స్థానాలకు గాను 15 స్థానాలను గెలుచుకున్నాయి.
 
ప్రతిపక్ష కాంగ్రెస్ ఏడు స్థానాలను గెలుచుకుంది. గతంలో కాంగ్రెస్ నాలుగు స్థానాలు మాత్రమే గెల్చుకుంది. “ఒక నిర్దిష్ట మతం ఆ రాష్ట్రాలలో మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా వెళ్ళింది.  ఆ మతానికి ఆ రాష్ట్రాల్లో విపరీతమైన అనుచరులు ఉన్నారు. తద్వారా మార్పు వచ్చింది. ఇది రాజకీయ ఓటమి కాదు, ఎందుకంటే ఎవరూ మతంతో పోరాడలేరు, ”అని శర్మ చెప్పారు.