
కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పథకానికి సంబంధించి తొలుత ఖరారు చేసిన డిజైన్లను ఎందుకు మార్చాల్సివచ్చింది? ఎవరి ఆదేశాల మేరకు మార్చారు? వంటి విధానపరమైన అంశాలపై అప్పట్లో కీలక స్థానాలలో వ్యవహరించిన ఐఏఎస్ అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ప్రాజెక్టు పనులకు సంబంధించి నిధుల విడుదలలో పాటించిన పద్దతులు, రిజర్వాయర్లు, బ్యారేజిల నిర్మాణ దశలో పర్యవేక్షణ ఎలా చేశారు? కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ప్యాకేజిల వారీగా నిధుల అంచనాలు, నిర్మాణంలో ఉండగానే వాటి అంచనాల పెంపుదల, కాంట్రాక్టర్లకు నిధుల విడుదల తదితర అంశాలపై ప్రశ్నలు సంధించి వివరాలు రాబట్టే ప్రయత్నాలు జరిగాయి.
మొత్తం ప్రాజెక్టు వ్యయపు అంచనాలు ఎంత, ఎంత ఖర్చు చేశారు? బిల్లుల చెల్లింపులు ఎవరెవరికి ఎలా చేశారు తదితర ప్రశ్నలు వేశారు. టెండర్లు దక్కించుకున్న కంపెనీలు వాటి పరిధిలో సబ్కాంట్రాక్టర్లను ఎలా నియమించుకున్నారు? వారు చేపిన పనుల వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారు.
గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, నీటిపారుదల, ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తించిన అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తుంది. సోమవారం నాడు కమిషన్ ముందు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, నీటిపారుదల శాఖలో ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ కుమార్, ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు.
అదేవిధంగా, గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసిన వికాస్రాజ్, గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ఇన్చార్జి కార్యదర్శిగా, ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహించిన స్మితా సబర్వాల్ హాజరయ్యారు. వారందరినీ కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు.
బడ్జెట్ సమావేశాలు ఉన్నందున తనకు కొంత సమయం కావాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కమిషన్ను కోరారు. మాజీ సీఎస్ ఎస్కే జోషి వర్చువల్ విధానంలో హాజరయ్యారు. కాగా, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తలపెట్టిన తుమ్మడిహట్టిని కాదని, మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతలకు చేపట్టడమే ప్రధాన తప్పు అని విద్యుత్శాఖ ఇంజనీర్ కె.రఘు తెలిపారు.
డీపీఆర్ ఆమోదానికి ముందే బ్యారేజీల నిర్మాణంతో డిజైన్లలో లోపాలు వచ్చాయని, బ్యారేజీ స్థలాల ఎంపికలో కూడా చాలా లోపాలు ఉన్నాయని అన్నారు. ఈపీసీ ఒప్పందం ప్రకారం ప్రక్రియ జరగలేదని, లోపాలు చాలా ఉన్నాయన్న ఆయన, గుత్తేదారులకు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని చెల్లింపులు చేసినట్లు చెప్పారు. 2019లో బ్యారేజీలు పూర్తయ్యాక నిర్వహణ చేపట్టిన పాపాన పోలేదని, అందుకే అవి దెబ్బతిన్నాయని అభిప్రాయపడ్డారు.
More Stories
తెలంగాణలో యూరియా కొరత రావొద్దు
కేసీఆర్ ఇలాఖా నుంచి బిజెపిలో భారీగా చేరికలు
హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు అరెస్ట్