ఏపీ సర్కారుకు బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ మందలింపు

ఏపీ సర్కారుకు బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ మందలింపు
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నదీజలాల పంపకాల విషయంలో ట్రైబ్యునల్‌లో సోమవారం విచారణ జరిగింది. అయితే, అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయం కోరింది. కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో పరిగణలోకి తీసుకున్న ట్రైబ్యునల్‌ నాలుగు వారాల సమయం ఇస్తూ కేసును వాయిదా వేసింది. 
 
అయితే, ఎస్‌ఓసీని దాఖలు చేసేందుకు ఇదే ఏపీకి చివరి అవకాశమని ట్రైబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. నాలుగు వారాల్లో ఎస్‌ఓసీని దాఖలు చేయాలంటూ విచారణను ఆగస్టు 28-29 తేదీలకు వాయిదా వేశారు. సెక్షన్‌-3 ప్రకారం.. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్ ట్రైబ్యునల్‌ కేంద్ర ప్రభుత్వం గత అక్టోబర్‌లో మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ క్రమంలో ట్రైబ్యునల్‌ నదీ జలాల పంపిణీకి సంబంధించి విచారణ చేపట్టే ప్రక్రియను ప్రారంభించింది. విచార‌ణ‌కు సంబంధించిన అంశాల‌పై ఇరు రాష్ట్రాలను స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌ దాఖలు చేయాలని గతంలోనే స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఇరు రాష్ట్రాలు ఎస్‌వోసీలను దాఖలు చేశారు. అయితే, వాటిని ప‌రిశీలించిన అనంత‌రం విచార‌ణ‌కు తీసుకోవాల్సిన అంశాలు, రాష్ట్రాల తరఫున సాక్ష్యుల విచార‌ణ‌కు సంబంధిత‌న అంశాల‌పై తుది ఎస్‌వోసీల‌ను దాఖ‌లు చేయాల‌ని ట్రైబ్యునల్‌ చైర్మన్‌ ఆదేశించారు. ఆదేశాల మేరకు తెలంగాణ ఇప్పటికే స్టేట్‌మెంట్‌ను దాఖలు చేసింది. 

ఏపీ సర్కారు మాత్రం ఎస్‌ఓసీని దాఖలు చేయకుండా కాలయాపన చేస్తూ వస్తున్నది. గ‌తంలో ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎస్‌ఓసీ దాఖ‌లు చేయ‌లేక‌పోతున్నామ‌ని, మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని ఏపీ స‌ర్కారు కోర‌గా నాలుగు వారాల గడువు ఇచ్చింది. గ‌త మే 15న ట్రైబ్యునల్‌ విచారణను జూలై 15వ తేదీకి వాయిదా వేసింది. అయినా ఎస్‌ఓసీ దాఖలు చేయలేదు. 

కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో విధానపరమైన అంశాలను చర్చించి దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని చైర్మన్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే, జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు. పదే పదే విచారణకు సమయం కోరడం, వాయిదా వేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. చివరి అవకాశం కల్పిస్తున్నామని, నాలుగు వారాల్లో ఎస్‌ఓసీని దాఖలు చేయకపోయినా తదుపరి విచారణ ప్రారంభిస్తామిన ఏపీ సర్కారుకు స్పష్టం చేశారు.

విచారణు ఆగస్టు 28-29 తేదీలకు వాయిదా వేశారు. విచార‌ణ‌కు తెలంగాణ త‌రుపున సీనియ‌ర్ న్యాయ‌వాది వైద్యనాథ‌న్‌, ర‌వీంద‌ర్‌రావు, నిఖిల్‌స్వామి, ఇంట‌ర్‌స్టేట్ విభాగం ఎస్‌ఈ స‌ల్లా విజ‌య్‌కుమార్‌, అనురాగ్ శ‌ర్మ‌, ఏపీ త‌ర‌ఫున సీనియ‌ర్ అడ్వకేట్ జ‌య‌దీప్ గుప్తా, ఉమాప‌తి తదితరులు హాజరయ్యారు.