అస్సాంలో వరద బీభత్సం… 52 మంది మృతి

అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. కుండపోతతో గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. రహదారులు, కమ్యూనికేషన్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇక మరిగావ్‌ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
 
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ కనీసం ఎనిమిది ఆయకట్టు కట్టలు తెగిపోవడం వల్ల వరద పరిస్థితి మరింత దిగజారిందని, ఇది అరుణాచల్ ప్రదేశ్, భూటాన్‌లలో భారీ వర్షాల వల్ల ఎక్కువగా సంభవించిందని తెలిపారు. 

అస్సాం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ  ప్రకారం గత 24 గంటల్లో వరదల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది వరదలు, కొండ చరియలు విరిగిపడటం, తుపానుల కారణంగా రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 52కు పెరిగింది. అదేవిధంగా, ఈ వరదలకు 3,208 గ్రామాలు వరదలకు తీవ్ర ప్రభావితమయ్యాయి. 29 జిల్లాల్లోని 21 లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారు.

గోల్‌పరా, నాగావ్, నల్బరీ, కమ్రూప్, మోరిగావ్, దిబ్రూఘఢ్‌, సోనిత్‌పూర్, లఖింపూర్, సౌత్ సల్మారా, ధుబ్రి, జోర్హాట్, చారైడియో, హోజై, కరీంనగర్, శివసాగర్, బొంగైగావ్, బార్‌పేట, ధేమాజీ, హైలాకండి, గోలాఘాట్, దర్రాంగ్, బిస్వనాథ్, కాచర్, కమ్రూప్ (ఎం), టిన్సుకియా, కర్బీ అంగ్లాంగ్, చిరాంగ్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, మజులి జిల్లాలు వరదల కారణంగా తీవ్ర ప్రభావితమయ్యాయి.

ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 515 పునరావాస శిబిరాల్లో సుమారు 3.86 లక్షల మంది తలదాచుకుంటున్నారు. 11,20,165 జంతువులు కూడా వరద బారిన పడ్డాయి. కజిరంగా నేషనల్‌ పార్క్, టైగర్‌ రిజర్వ్‌లో 31 వన్య ప్రాణులు మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. ఈ వరదలకు రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తమైంది.

ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాలలో కనీసం ఏడు జిల్లాలు తెగిపోయాయని అరుణాచల్ ప్రదేశ్ అధికారులు తెలిపారు. ప్రభావిత జిల్లాలలో లోహిత్, చాంగ్లాంగ్, అంజావ్, తూర్పు సియాంగ్ ఉన్నాయి. గత 48 గంటల్లో, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా ఇద్దరు పిల్లలు సహా ఎనిమిది మంది వ్యక్తులు మరణించారు.