![](https://nijamtoday.com/wp-content/uploads/2024/07/Modi-MPs.webp)
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ పార్లమెంటరీ సమస్యలపై అధ్యయనం చేయాలని ప్రధాని సూచించినట్లు చెప్పారు. తమ నియోజకవర్గానికి చెందిన అంశాలను పార్లమెంట్లో రెగ్యులర్గా ప్రస్తావించాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగానికి కౌంటర్ మోదీ ఇస్తారని, ఆ సందేశం ప్రతి ఒక్కర్నీ ఉద్దేశించి ఉంటుందని మంత్రి రిజిజు తెలిపారు.
పార్టీలతో సంబంధం లేకుండా దేశానికి సేవ చేయడం మన మొదటి బాధ్యతని, దేశానికి తొలి ప్రాధాన్యమిస్తూ పని చేయాలని ఎన్డీఏ ఎంపీలకు హితోపదేశం చేశారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు.
మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఎంపీలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. తమకు ప్రధాని చాలా ముఖ్యమైన మంత్రాన్ని ఉపదేశించారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి ఎంపీ దేశానికి సేవ చేసేందుకు సభకు ఎన్నికయ్యారని, నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై ఎంపీలు అవగాహన పెంచుకోవాలని మోదీ దిశా నిర్దేశం చేశారని వెల్లడించారు.
మంచి ఎంపీగా ఎదగడానికి అవసరమైన పార్లమెంట్ నియమాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రవర్తనను అనుసరించాలని ఎన్డీఏ ఎంపీలను ప్రధాని మోదీ కోరారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రధాని మార్గ నిర్దేశనం ఎంపీలందరికీ, ప్రత్యేకించి తొలిసారి సభకు వచ్చిన సభ్యులకు ఒక మంచి మంత్రంగా తాము భావిస్తున్నామని చెప్పారు. ప్రధాని హితబోధ చేసిన మంత్రాన్ని తాము అనుసరించాలని నిర్ణయంచుకున్నామని వెల్లడించారు.
‘సీనియర్ ఎంపీల నుంచి పార్లమెంటరీ నియమాలు ప్రవర్తనను నేర్చుకోవాలని నూతన ఎంపీలకు మోదీ సూచించారు. తొలిసారిగా కాంగ్రెసేతర నేత మూడోసారి ప్రధాని కావడం వల్ల ప్రతిపక్షాలు కలత చెందాయని అన్నారు. పార్లమెంటరీ సమస్యలను అధ్యయనం చేయాలని, క్రమం తప్పకుండా పార్లమెంటుకు హాజరు కావాలి. మీడియా ముందు సమస్యలను ప్రస్తావించే ముందు వాటిపై పూర్తిగా అధ్యయనం చేయాలి. ఎంపీలందరూ నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడూ టచ్లో ఉండాలి’ అని ప్రధాని మోదీ సూచనలు చేసినట్లు కిరణ్ రిజిజు తెలిపారు.
More Stories
జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ప్రధాని మోదీతో టీమ్ ఇండియా క్రికెటర్ల భేటీ
ఆర్థిక సంక్షోభం నుండి ఆదుకోమని ప్రధానిని కోరిన చంద్రబాబు