పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అమెరికా, కెనడా నిపుణులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను అమెరికా, కెనడాకు చెందిన అంతర్జాతీయ జలవనరుల నిపుణులు ఆదివారం పరిశీలించారు. నలుగురు సభ్యులు గల నిపుణులు ఆదివారం నుంచి జులై 3 వరకు ప్రాజెక్టుకు చెందిన ప్రతి విభాగాన్ని పరిశీలించనున్నారు.

అమెరికాకు చెందిన డేవిడ్‌ పి పాల్‌, గెయిన్‌ ఫ్రాంకో డి సిక్కో, కెనడా నుంచి రిచర్డ్‌ డానెల్లీ, సీన్‌ హించ్‌ బెర్గర్‌ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా డయాఫ్రం వాల్, రెండ్ కాఫర్‌ డ్యాంలు, గైడ్‌ బండ్‌లను వారు పరిశీలించారు. నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. 

స్థానిక అధికారులు పనుల తీరు, ప్రాజెక్టు నిర్మాణం గురించి నిపుణులకు తెలిపారు.  ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు మొదలుపెట్టింది.   ప్రాజెక్టు డిజైన్లపై నిపుణులు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. 

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎగువ, దిగువ కాపర్‌డ్యాంలు , డయాఫ్ర్ వాల్‌ పనులను ప్రారంభించింది. 2019లో వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత అవి వరదలకు కొట్టుకుపోయాయి. ఈపనుల పునరుద్ధరణలో జాప్యం జరగడంతో ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి టీడీపీ పోలవరంపై ఫోకస్‌ పెట్టింది.

ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టును సందర్శించడంతో పాటు పునరుద్ధరణ పనులు చేపట్టడానికి అమెరికా, కెనడాకు చెందిన సంస్థలతో మాట్లాడి జలవనరుల నిపుణులను రప్పించారు. వారు ఇచ్చే నివేదికల ఆధారంగా పోలవరం ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. నిపుణులు నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు డిజైన్లను సమగ్రంగా అధ్యయనంతో పాటు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో, నిర్మాణ సంస్థలతో కలిసి రివ్యూ చేయనున్నారు.