కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్​ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్, గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లోనే ఉంచారు. సాయంత్రం నిజామాబాద్ ప్రగతినగర్‌లోని ఆయన నివాసానికి పార్థీవదేహాన్ని తరలించనున్నారు.

తండ్రి మృతి పట్ల కుమారుడు, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ భావోద్వేగ పోస్ట్​ పెట్టారు. ప్రస్తుతం దిల్లీలో ఉన్న ఆయన, ‘అన్నా అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇకలేరు. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కోరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా.. నువ్వు ఎప్పటికి నాతోనే, నాలోనే ఉంటావు’ అంటూ ట్వీట్​ చేశారు.

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీఎస్‌ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆయన, నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఉమ్మడి ఏపీలో 2004, 2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు  1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖల మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నతవిద్య, అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో టిఆర్ఎస్ తో కాంగ్రెస్ ఎన్నికల పొత్తు ఏర్పర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. 2014లో మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

కాంగ్రెస్ లో సోనియా గాంధీకి విధేయునిగా డీఎస్‌కు గుర్తింపు పొందారు. ప్రణబ్ ముఖర్జీ, తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే, 2015లో మరోసారి ఎమ్యెల్సీ సీటు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ ను వదిలి బిఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు.

అయితే నిజామాబాదు జిల్లాలో నాటి ముఖ్యమంత్రి కుమార్తె కవితతో పొసగక ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. డీఎస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్‌ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌ గతంలో నిజామాబాద్‌ మేయర్​గా పని చేశారు.