పోలవరంలో రూ 3,385 కోట్ల కేంద్ర నిధుల దారి మళ్లింపు

* జగన్ పాలనలో రూ 4,900 కోట్ల నష్టం, రైతులకు రూ 45,000 కోట్ల నష్టం
 

పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధుల్లో  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.3,385 కోట్లు దారి మళ్లించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం రూ.4,161 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.4,900 కోట్లు నష్టం జరిగిందనీ, పోలవరం ఆలస్యంతో రైతులకు రూ.45,000 కోట్లు నష్టం వాటిల్లిందని వెల్లడించారు.

 
పోలవరం ప్రాజెక్టుపై మొదటి శ్వేతపత్నాన్ని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి విడుదల చేస్తూ  వైఎస్ జగన్ ప్రభుత్వ అసమర్థతతో గైడ్ బండ్ కుంగిపోయిందని ఆరోపించారు. వైఎస్ జగన్ పోలవరం పాలిట శాపంగా మారారన్న చంద్రబాబు నాయుడు. వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందని విమర్శించారు. 
 

2019లో సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే పోలవరం ఆపేయాలని ఆదేశించారని చంద్రబాబు ఆరోపించారు. నిరాధార ఆరోపణలపై కాంట్రాక్టర్‌ను మార్చారని,  రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును సర్వనాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఏజెన్సీని మార్చకపోతే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేందని చంద్రబాబు చెప్పారు.

మరోవైపు 2014- 19 మధ్య పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తిచేశామన్న చంద్రబాబు వైసీపీ పాలనలో ప్రాజెక్టును నాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్ర విభజన వలన జరిగిన నష్టం కంటే వైసీపీ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.

 
పోలవరంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఐఐటీ హైదరాబాద్ చెప్పిందన్న చంద్రబాబు పోలవరం మరమ్మత్తుల కోసం అమెరికా, కెనడా నుంచి నిపుణులను రప్పిస్తామని చెప్పారు. వారు ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో, అంతర్జాతీయ, దేశీయ నిపుణుల తోడ్పాటుతో పోలవరం ప్రాజెక్టులో సవాళ్లను అధిగమిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
 
టీడీపీ అధికారంలో ఉన్నప్పడు పోలవరం పనులు ఒక యజ్జంలా సాగాయని, అప్పట్లో ఉన్న సమస్యలను, సవాళ్లను అధిగమించి మరీ ముందుకు వెళ్లామని చంద్రబాబు గుర్తుచేశారు. ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్‌లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి నాటి ప్రభుత్వం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిందని చంద్రబాబు గుర్తుచేశారు. 
 
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు హెడ్ వర్కుల పనులు చేస్తూనే ఎగువ, దిగువ కాఫర్ కాఫర్ డ్యాంల నిర్మాణం పనులు పూర్తి చేశామని చెప్పారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో 414 రోజుల్లో పూర్తి చేశామని చంద్రబాబు ప్రస్తావించారు.  టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తయ్యాయని, 5 ఏళ్ల కాలంలో 28 సార్లు క్షేత్ర స్థాయి పర్యటనకు, 82 సార్లు వర్చ్యువల్‌గా చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ 5 ఏళ్ల కాలంలో మొత్తం 72 శాతం పనులు జరగగా.. అందుకు రూ.11,537 కోట్లు ఖర్చయ్యాయి.