రుణమాఫీకి షరతులు విధించడం వెన్నుపోటు

ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి  అధికారంలోకి వచ్చాక, ప్రారంభ ముగింపు తేదీలు అంటూ  షరతులు విధించడం
రైతులకు వెన్నుపోటు పొడవడమేనని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి విరుచుకు పడ్డారు. 
 
 బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ రాష్ట్ర పధాదికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  రాహుల్ గాంధీ తుక్కు గూడ కాంగ్రెస్ సభలో హామీ  ఇచ్చిన విధంగా సంపూర్ణంగా రెండు లక్షల రుణ మాఫీ చేయక పోతే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ తుక్కు రెగ్గొట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు విత్తనాలు, నాట్లు వేస్తూ పెట్టుబడికి డబ్బులు లేక అల్లాడుతు ఉంటే రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ అంటూ రైతుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సేద్యం చేసే రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా ఇవ్వడానికి  బ్యాంక్ ల్లో బకాయి పడ్డ రైతులకు రుణ మాఫీ చేయడానికి  ప్రభుత్వానికి చేతులు ఎందుకు రావడం లేదని  ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ  హామీ ఇచ్చిన ప్రకారం షరతులు లేకుండా  రుణ మాఫీ చేయకపోతే, సేద్యం చేసే రైతుకు రైతు భరోసా ఇవ్వక పోతే బీజేపీ  కిసాన్ మోర్చా చూస్తూ ఊర్ర్కోదని ఆయన హెచ్చరించారు. రైతులతో కలసి అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.  రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని  రేవంత్ రెడ్డి  తుంగలో తొక్కారని దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, బస్వ పాపయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు