మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు సంతకాలు చేసిన మొదటి ఐదు ఫైళ్లకు ఆమోదం తెలిపారు. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక భద్రతా పింఛన్లు రూ.4000లకు పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్య గణన ఫైళ్ల మీద చంద్రబాబు తొలి ఐదు సంతకాలు చేశారు.

  వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా పునరుద్ధరించాలనే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీ కింద 16,437 పోస్టులను డిసెంబర్ పదో తేదీలోపు భర్తి చేయనున్నారు. ఇందుకోసం జులై ఒకటి నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది.  వచ్చే జూలై 1 తేదీ నుంచి రూ 3,000 నుండి రూ 4,000 `ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ లను 65 లక్షల మంది లబ్ధిదారులకు ఒకేసారి రూ 7,000 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు.  183 అన్న క్యాంటీన్లను ఆగస్టు నెలలో ఒకే రోజున ఒకేసారి ప్రారంభించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.

 వీటితో పాటు ఎన్నికల్లో ప్రధాన హామీలుగా ప్రకటించిన సూపర్ – 6 పథకాల అమలు, అందుకు అణుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చించినట్లు సమాచారం. వీటితో పాటు సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా చర్చించినట్లు తెలుస్తోంది.

 జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్‌ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అస్సైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లపైనా వివరాలు క్యాబినేట్‌ ముందుకు వచ్చాయి. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

వివిధ కార్పొరేషన్ల పునరుద్దరణ వాటికి నిధుల సమీకరణ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్థి, ఎన్నికల్లో ప్రకటించిన బీసీలకు రక్షణ చట్టం హామీ అమలు, వివిధ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, నూతన విద్యవిధానం, ఉచిత ఇసుక వంటి కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.