అమెరికాలో దుండగుడి కాల్పులు – బాపట్ల యువకుడు మృతి

అమెరికాలో దుండగుడి కాల్పులు – బాపట్ల యువకుడు మృతి

అమెరికా ఆర్కెన్సాస్‌లోని సూపర్ మార్కెట్‌లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్​కు చెందిన యువకుడు మృతి చెందారు. బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు దాసరి గోపీకృష్ణ ఆర్కెన్సాస్ రాష్ట్రంలోని సూపర్ మార్కెట్లో పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అగంతకులు జరిపిన కాల్పుల్లో గోపీకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మృతుడి స్వస్థలం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలిగా గుర్తించారు. యాజలి గ్రామానికి చెందిన 32 ఏళ్ల గోపికృష్ణ జీవనోపాధి కోసం 10 నెలల క్రితం అమెరికాకు సాఫ్ట్​వేర్ జాబ్ కోసం వెళ్లారు. 

ఆర్కెన్సాస్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో పార్ట్ టైంగా పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్‌లో ఉండగా ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతనిపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో గోపికృష్ణ కుప్పకూలిపోయారు. కాల్పులు జరిపిన దుండగుడు సూపర్‌ మార్కెట్‌లో వస్తువులు తీసుకుని పరారయ్యాడు.

సమాచారం తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. అమెరికాలోని తానా అసోసియేషన్ ద్వారా మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.