బీఆర్ఎస్ ఎమ్యెల్యేపై సోదాల్లో రూ 300 కోట్ల అక్రమాలు గుర్తింపు 

మైనింగ్‌లో ప్రభుత్వానికి పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి రూ.39 కోట్లు నష్టం చేకూర్చినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గుర్తించారు. మొత్తం రూ.300 కోట్ల మేర మైనింగ్‌ అక్రమాలు జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. సంతోశ్ శ్యాండ్, సంతోశ్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు కొనసాగించారని ఈడీ పేర్కొంది.

మైనింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన మహిపాల్‌రెడ్డి సోదరుల నివాసాల్లో సోదాల సమయంలో ఈడీ 19 లక్షల రూపాయల నగదు గుర్తించింది. ఈ మేరకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసాల్లో జరిగిన సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది. మనీలాండరింగ్‌, హవాలా నేపథ్యంలో సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు.

బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్టు ఈడీ వివరించింది. బినామీ పేర్లతో లావాదేవీలనూ ఈడీ గుర్తించింది. మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందని, మహిపాల్‌రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్టు బయటపడిందని అధికారులు పేర్కొన్నారు.