బక్రీద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది పోలీసులు పక్షపాత ధోరణి ప్రదర్శించారని, పనిగట్టుకుని హిందువులపై కేసులు పెట్టారని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. ముఖ్యంగా మెదక్ పట్టణంలో పోలీసుల అలసత్వం కారణంగా అల్లర్లు జరిగాయని, అల్లర్లలో దోషులను వదిలిపెట్టి బాధితులను రిమాండ్ చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరింది.
రాష్ట్ర డిజిపి రవి గుప్తాను కలిసి పరిషత్ ప్రతినిధి బృందం మెదక్ పట్టణంలో ఆవుల విషయమై స్థానిక ఇన్ స్పెక్టర్ కారణంగా కత్తిపోట్లు, పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయని ఆరోపించారు. తర్వాత జరిగిన పరిణామాలలో మెదక్ ఎస్పీ బాలస్వామి, ఐజి రంగనాథ్ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ హిందువులపైనే కేసులు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారని విమర్శించారు.
దాడికి పాల్పడ్డ దోషులను ఉపేక్షించడం జరిగిందని, వెంటనే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. “నేను సస్పెండ్ అయినా పర్వాలేదు. హిందూ నాయకులను వందమందిని జైల్లో వేసి వెళ్తాను” అంటూ మెదక్ టౌన్ ఇన్ స్పెక్టర్ పరిషత్ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ లోని మలక్ పేట నియోజకవర్గం చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్ట వ్యతిరేకంగా తరలిస్తున్న ఎద్దులను అడ్డుకున్న యువతులను చంపేస్తామని భయభ్రాంతులకు గురిచేసి, నానా బూతులు తిట్టినా దోషులను ఇప్పటివరకు పట్టుకోకపోవడం, వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం దుర్మార్గమని విమర్శించారు.
అదేవిధంగా పట్టుకున్న ఎద్దులు , వాటిని తరలిస్తున్న వాహనాలను, డ్రైవర్లను ఇప్పటివరకు అదుపులోకి తీసుకోకపోవడం హిందూ వ్యతిరేక చర్య అని వారు ఆరోపించారు. దగ్గరుండి ఆవులను హత్య చేసేందుకు పోలీసులు సహకరిస్తున్నారని విమర్శించారు. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ లో విషయంలో కూడా దోషులను వదిలిపెట్టి బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలను అదుపు లోకి తీసుకునేందుకు తీవ్రంగా పోలీసులు శ్రమిస్తున్నారని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ఆవులను మితిమీరి ఒకే వాహనంలో ఎక్కించడం వల్ల, తొక్కిసలాటకు గురై దాదాపు 12 ఆవులు చనిపోయాయని, కానీ ఈ విషయాలను బయటకు రాకుండా తొక్కి పెడుతున్నారని, వాటికి పోలీసులదే బాధ్యత అని చెప్పారు.
చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన పోలీసులే హిందూ విరోధులుగా వ్యవహరించడం ఏమాత్రం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా దోషులను అరెస్ట్ చేయకపోతే తాము రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధపడాల్సి వస్తుందని డీజీపీకి తెలియజేశారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, పరిషత్ మెదక్ జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు.

More Stories
భారత్ అండర్ -19 జట్టు కెప్టెన్ గా హైదరాబాద్ కుర్రాడు
నాగార్జునకు కొండా సురేఖ క్షమాపణలు
21న సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకానున్న జగన్!