అన్నాడీఎంకేలో తిరిగి ప్రవేశించేందుకు శశికళ సిద్ధం!

అన్నాడీఎంకే పార్టీలోకి తాను తిరిగి ప్రవేశించేందుకు సమయం ఆసన్నమైనదని  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రాణ స్నేహితురాలు, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ కీలక ప్రకటన చేశారు. పార్టీలోకి తన పున:ప్రవేశం మొదలైందని చెప్పారు. 

 ఇటీవల‌ వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఏఐఏడీఎంకే పతనం అవుతుందని భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గెలిచి అమ్మ పాలనకు నాంది పలుకుతామని భరోసా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రస్తుత ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్నలు అడగడంలేదని ఆమె ధ్వజమెత్తారు. 

ఇకపై ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తానని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. తన మద్దతుదారులతో జరిగిన ఓ కార్యక్రమంలో శశికళ మాట్లాడుతూ ‘నేను మీకు చెబుతున్నా.. సమయం ఆసన్నమైంది. ఎటువంటి ఆందోళనా అవసరం లేదు. తమిళనాడు ప్రజలు కచ్చితంగా మావైపే ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పగలను. అన్నాడీఎంకే కథ ముగిసిందని అనుకోవద్దు. నా రీ ఎంట్రీ ప్రారంభమైంది’ అని తెలిపారు.

కార్యకర్తల పార్టీ అన్నాడీఎంకే అని వీకే శశికళ చెబుతూ ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్‌, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని వివరించారు. అలాంటిది ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. పార్టీలో కుల రాజకీయాలను ప్రోత్సహించడాన్ని పార్టీ కార్యకర్తలు సహించరని ఆమె హెచ్చరించారు.

జయలలిత కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసి ఉంటే 2017లో పళనిస్వామి సీఎం అయ్యి ఉండేవారు కాదని ఆమె చెప్పారు. అందరినీ ఏకం చేసి అన్నాడీఎంకే పార్టీని బలోపేతం చేయడే తన లక్ష్యం అని తెలిపారు. ఇందుకోసం తన ప్రయత్నం మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు.