రైలు ప్రమాదం మార్గంలో యధావిధిగా రైళ్లు

రైలు ప్రమాదం మార్గంలో యధావిధిగా రైళ్లు
* ప్రమాదానికి సిగ్నల్‌ లోపమే కారణమా?
 
పశ్చిమబెంగాల్‌లోని డార్జింగ్‌లో ఒకే ట్రాక్‌పైక వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదం జరిగిన మార్గంలో 12 గంటల సమయంలోనే యధావిధంగా రైళ్ల రాకపోకలు ప్రారంభం అయ్యాయి.సోమవారం ఉదయం త్రిపురలోని అగర్తలా నుంచి కోల్‌కతాలోని సీల్దాకు వెళ్తున్న కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ రైలును న్యూ జల్‌పాయ్‌గురి రైల్వే స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని రంగపాని స్టేషన్‌ సమీపంలో అదే ట్రాక్‌పై వెనుక నుంచి వచ్చిన ఒక గూడ్స్‌ రైలు ఢీకొట్టింది. 
 
ప్రమాదం ధాటిని ఎక్స్‌ప్రెస్‌ రైలులోని నాలుగు బోగీలు ధ్వంసమయ్యాయి. గూడ్సు బడ్డాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా , 41 మంది గాయపడ్డారు. ప్రమాదం అనంతరం ఫన్సిడేవా వద్ద రైల్వే ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలను సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగించారు. విద్యుత్‌ లైన్లను బాగుచేశారు. అనంతరం రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. కాగా, ప్రమాదం జరిగిన రాణిపత్ర రైల్వే స్టేషన్‌, ఛట్టర్‌ హాట్‌ జంక్షన్‌ మధ్య ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ సోమవారం ఉదయం 5.50 గంటల నుంచి పనిచేయడం లేదని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ 8.27 గంటలకు రంగపాని స్టేషన్‌ నుంచి బయలుదేరిందని, రాణిపత్ర రైల్వే స్టేషన్‌, ఛట్టర్‌ హాట్‌ జంక్షన్‌ మధ్య ఆగిందని రైల్వే అధికారి చెప్పారు. 

సిగ్నల్‌ వ్యవస్థ విఫలమైన క్రమంలో రాణిపత్ర స్టేషన్‌ మాస్టర్‌ కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌కు టీఏ 912 అథారిటీ జారీచేశారని, ఇది సెక్షన్‌లోని రెడ్‌ అన్ని సిగ్నల్స్‌ను దాటేందుకు రైలు పైలట్‌కు అనుమతి ఇస్తుందని మరో అధికారి ఒకరు చెప్పారు.

అయితే అదే సమయంలో రంగపాని నుంచి 8.42 గంటలకు బయలుదేరిన గూడ్స్‌ రైలు కాంచన్‌జంగను వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిందని వివరించారు. గూడ్స్‌ రైలు డ్రైవర్‌ సిగ్నల్‌ను ఉల్లంఘించడంతో ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డు చైర్‌పర్సన్‌ జయవర్మ సిన్హా పేర్కొన్నారు. అయితే, గూడ్స్‌ డ్రైవర్‌ సిగ్నల్‌ను ఉల్లంఘించాడన్న రైల్వే బోర్డు చైర్‌పర్సన్‌ ప్రకటనను లోకోపైలట్‌ సంఘం ఖండించింది. సిగ్నల్ ను దాటేందుకు గూడ్స్ డ్రైవర్ కు అనుమతి అప్పటికి స్పీడ్ పరిమితులను ఉల్లంఘించారని రైల్వే బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి.