పోలవరం నిర్వాసితుల పునరావాసంపై దృష్టి సారిస్తారా!

పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత అని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా సోమవారం ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అయితే మొదటి నుండి ప్రాజెక్ట్ నిర్మాణం పట్ల చూపుతున్న శ్రద్ధను ప్రభుత్వాలు నిర్వాసితుల పునరావాసం పట్ల చూపడం లేదు. ఇప్పటికైనా ఆయన ఈ సమస్య పరిష్కారం కోసం దృష్టి సారిస్తారని ఆశిద్దాం.
 
పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ రూ.పది లక్షలు, 2006కు ముందు సేకరించిన భూములకు రూ.ఐదు లక్షలు పరిహారం ఇస్తామని ఇచ్చిన హామీని వైసిపి ప్రభుత్వం విస్మరించింది. కాఫర్‌ డ్యామ్‌ పూర్తి కావడంతో వరదల సమయంలో ఏటా గ్రామాలన్నీ మునిగిపోతున్నాయి. పరిహారం అందించకపోవడం, గ్రామాలను తరలించకపోవడంతో నిర్వాసిత గిరిజనులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. 
 
పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున దీని నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలి. అయితే, పరిహారం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదరడం లేదు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వమైనా తమ సమస్యలను పరిష్కరించాలని నిర్వాసితులు కోరుతున్నారు. పాలకుల నిర్వాకం ఫలితంగా పోలవరం నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 
 
ప్రాజెక్టు పూర్తి గురించి మాట్లాడుతున్నారే తప్ప, సర్వం కోల్పోయి చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లు బతుకీడుస్తున్న నిర్వాసితుల గురించి ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యాం పూర్తవడంతో ఏటా జులై, ఆగస్టుల్లో గోదావరి వరదలకు కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, ఎటపాక, విఆర్‌ పురం, దేవీపట్నం మండలాల్లో వందలాది గ్రామాలు నీట మునుగుతున్నాయి. 
 
పరిహారం విషయంలో ఇచ్చిన హామీని గత వైసిపి ప్రభుత్వం నిలుపుకోలేకపోయింది. ఏటా వరదలకు గ్రామాలు నీటమునగడంతో జనం పునరావాస శిబిరాలకు, కొండలు గుట్టలపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాల్సి వస్తోంది. 2022 వరదల అనంతరం పర్యటించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అదే ఏడాది డిసెంబర్‌ కల్లా నిర్వాసితులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. 
 
2023లో వచ్చిన వరదలకు కుక్కునూరు మండలం గొమ్ముగూడెం విచ్చేసిన ఆయన 2024 జనవరి కల్లా పరిహారం ఇస్తామని చెప్పారు. ఇవేవీ అమలుకు నోచుకోలేదు. గోదావరికి జులై, ఆగస్టు నెలల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది. ముందుగా నిర్వాసితులకు పరిహారం ఇచ్చి వారిని నిర్వాసిత కాలనీలకు తరలించాలి. లేకపోతే వరదలకు తలోదారి అన్నట్లు పరిస్థితి ఏర్పడనుంది. 
 
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తమ తొలి ప్రాధాన్యతగా చెబుతోంది. ఈ దృష్ట్యా పోలవరం నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు 18 ఏళ్లు నిండిన యువతకు పరిహారంపై కటాఫ్‌ డేట్‌పైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  కొంతమందికి ఇప్పటికీ భూమికి భూమి ఇవ్వలేదు. అలాంటి సమస్యలనూ పరిష్కరించాలి.
నిర్వాసితులను త్యాగధనులుగా కీర్తిస్తున్న ప్రభుత్వాలు వారికి న్యాయం మాత్రం చేయడం లేదు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సోమవారం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్వాసితులు కోరుతున్నారు. ముందుగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించిన తర్వాతనే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా ప్రభుత్వాలు లెక్కచేయడం లేదు.