దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామాఫోసా రెండోసారి ఎన్నియ్యారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ), ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం వల్ల ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమైంది. రామాఫోసాకు చెందిన ఏఎన్సీ, డెమోక్రటిక్ అలియన్స్, ఇతర చిన్న పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.
విజయం ఖారారు అయిన తర్వాత రామాఫోసా ప్రసంగిస్తూ కొత్త కూటమి ప్రభుత్వాన్ని ఆయన కొనియాడారు. దేశం మంచి కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఓటర్లు తీర్పు ఇచ్చినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా జరిగిన తాజా ఎన్నికల్లో ఎన్సీకి 40 శాతం, డీఏకు 22 శాతం ఓట్లు పోలయ్యాయి. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని అసాధారణ చర్యగా ఏఎన్సీ ప్రధాన కార్యదర్శి ఫికిలే మలులా తెలిపారు.
పాలక ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఎఎన్సి) నేత అయిన సిరిల్ను నేషనల్ అసెంబ్లీ ఎన్నుకుంది. రమాఫొసాకు 283ఓట్లు వచ్చాయని నేషనల్ అసెంబ్లీ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రేమండ్ జోండో ప్రకటించారు. మరో అభ్యర్ధి జూలియస్ మలెమాకు కేవలం 44ఓట్లు వచ్చాయి.
అధ్యక్షుడుగా ఎన్నికైన అనంతరం పార్లమెంట్ను ఉద్దేశించి రమాఫొసా ప్రసంగిస్తూ ఈ ఎన్నిక తనపై పెద్ద బాధ్యతను మోపిందని, తనకు మద్దతివ్వని వారితో కూడా కలిసి పనిచేస్తానని చెప్పారు. దారిద్య్రం, నిరుద్యోగం, అసమానతలు ఈ మూడు సవాళ్ళను ఎదుర్కొనేందుకు, అందరికీ సంక్షేమాన్ని సాధించేందుకు శాంతి, న్యాయం, సుస్థిరత ప్రాతిపదికగా వివక్షారహిత ప్రజాస్వామ్య సమాజ లక్ష్యాలను సాధించేందుకు రాజకీయ పార్టీలు మన రాజ్యాంగం పరిధిలో కలిసి కృషి చేయాలని తమ ఓట్ల ద్వారా ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రమాఫోసా పేర్కొన్నారు.
జాతీయ ఐక్యతా ప్రభుత్వమంటే కేవలం రెండు మూడు పార్టీల సంకీర్ణం కాదని, అనేక పార్టీలు ఒక తాటిపైకి వచ్చి పాలన సాగిస్తాయని తెలిపారు. మన దేశ చరిత్రలో ఇదొక చారిత్రక తరుణమని పేర్కొంటూ మన రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలనను పెంపొందించడానికి మనందం కలిసి కట్టుగా పనిచేయాల్సి వుందని పిలుపిచ్చారు.
కొత్తగా ఏర్పాటు అయిన రామాఫోసా సర్కారు క్యాబినెట్లో డీఏ పార్టీ సభ్యులు కూడా ఉండనున్నారు. ఏఎన్సీ, డీఏ కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సౌతాఫ్రికన్లు ఒపీనియన్ పోల్స్లో అభిప్రాయపడ్డారు. దశాబ్ధాల పాటు ప్రత్యర్థులుగా ఉన్న ఏఎన్సీ, డీఏ పార్టీలు ఇప్పుడు కలిసికట్టుగా పోటీ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏఎన్సీ పార్టీ పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయింది.
More Stories
మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు
హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మృతి
జూలై 8 న కొత్త వీసా నిబంధనలను ప్రకటించనున్న అమెరికా