అరుంధతీరాయ్‌పై ఉపా కేసు

ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌తో పాటు, కశ్మీర్‌కు చెందిన మాజీ ప్రొఫెసర్‌లను చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద ప్రాసిక్యూట్‌ చేయడానికి ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. 2010లో దేశ రాజధానిలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఆరుంధతీ రాయ్‌ను, మాజీ ప్రొఫెసర్‌ షేక్‌ షౌకత్‌,  హుస్సేన్‌ను ఉపా కింద విచారణ జరిపించడానికి గవర్నర్‌ అనుమతించినట్టు రాజ్‌ నివాస్‌ అధికారులు శుక్రవారం తెలిపారు.
 
కాగా, న్యూఢిల్లీ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాల ప్రకారం అరుంధతీ రాయ్‌తో పాటు కశ్మీర్‌ ప్రొఫెసర్‌ షేక్‌ షౌకత్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీనిపై రాయ్‌, షౌకత్‌ ఇంకా స్పందించ లేదు. భారత్‌ నుంచి కశ్మీర్‌ను వేరు చేసే అంశాలపై ‘ఢిల్లీలో ఆజాది-ద ఓన్లీ వే’ పేరిట 2010 అక్టోబర్‌ 21న జరిగిన సమావేశంలో చర్చలు జరిగాయి. అందులో పార్లమెంట్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన సార్‌ గిలానీతో పాటు అరుంధతీ రాయ్‌ తదితరులు దేశ సమగ్రతను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్టు ప్రధాన ఆరోపణ.
 
ఈ ప్రసంగాలపై కశ్మీర్‌కు చెందిన సుశీల్‌ పండిట్‌ అనే వ్యక్తి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు కోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణకు అక్టోబరులో ఆమోదం తెలపగా, తాజాగా ఉపా కింద విచారణకు అంగీకారం తెలిపారు. వారితో పాటు కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు సయ్యద్‌ ఆలీ షా గిలానీ, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ లెక్చరర్‌ ఎస్‌ఏఆర్‌ గిలానీ, ప్రముఖ రచయిత వరవరరావులపైనా కేసులు నమోదయ్యాయి.
“సమావేశంలో మాట్లాడిన, చర్చించిన అంశాలు భారతదేశం నుండి కాశ్మీర్ విడిపోవడాన్ని ప్రచారం చేశాయి. ప్రసంగించిన వారిలో సయ్యద్ అలీ షా గిలానీ, ఎస్ ఏ ఆర్ గిలానీ (కాన్ఫరెన్స్ యాంకర్, పార్లమెంటు దాడి కేసులో ప్రధాన నిందితుడు), అరుంధతీ రాయ్, డా. షేక్ షోకత్ హుస్సేన్, వరవరరావు ఉన్నారు” అని ఓ అధికారి తెలిపారు.
 
న్యూఢిల్లీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సిఆర్‌పిసి సెక్షన్ 156(3) కింద ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేశారు. నవంబర్ 27, 2010న ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు.  గత అక్టోబర్‌లో, భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) 153ఏ (మతం, జాతి, జన్మస్థలం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం)లోని వివిధ సెక్షన్ల కింద శిక్షార్హమైన నేరాల కమీషన్ కోసం సీఆర్పీసీ సెక్షన్ 196 కింద వారిని ప్రాసిక్యూట్ చేయడానికి లెఫ్టనెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. =