ముంబై, ఢిల్లీ సందర్శన, భారతీయ సినిమాలపై చైనీయుల ఆసక్తి!

సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. భారత్ గురించి మరింత తెలుసుకోడానికి చైనీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయం స్వయంగా డ్రాగన్ అధికార పత్రిక సర్వేలో వెల్లడికావడం విశేషం. 
 
‘ది గ్లోబల్‌ టైమ్స్‌’ భారత్‌ గురించి ఇటీవల ఓ సర్వేను నిర్వహించగా ముంబయి, ఢిల్లీ నగరాలను సందర్శించాలని కోరిక ఎక్కువ మందిలో ఉన్నట్టు తేలింది. అలాగే, భారతీయ సినిమాలపైన కూడా చాలా మంది తమ అభిమానాన్ని తెలియజేశారు.  ‘ప్రపంచ వేదికపై భారత్‌ పాత్ర, భారత్- చైనా సంబంధాలు, చైనా-అమెరికా సంబంధాలు’ పై మే 23 నుంచి జూన్ 5 మధ్య గ్లోబల్ టైమ్స్ ఇన్‌స్టిట్యూట్ (జిటిఐ) ఓ సర్వేను నిర్వహించింది.
 
ఇంగ్లిష్, హిందీ,తమిళ్, బెంగాలీ మొత్తం నాలుగు భాషల్లో ఈ సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా చైనాలోని 1,440 మంది, భారత్‌లోని 1,466 మంది అభిప్రాయాలను సేకరించింది. దాదాపు 90 శాతం మంది చైనీయులు భారత్‌ గురించి మరింత తెలుసుకోవాలని ఉందని తెలిపారు. అలాగే, 70 శాతం మంది భారత్‌ను సందర్శించేందుకు ఆసక్తి కనబర్చారు. 
 
భారత్‌కు వెళ్లేందుకు 89 శాతం మంది పర్యాటకాన్ని ప్రధాన కారణంగా పేర్కొన్నారు. భారత్‌లోని సందర్శనీయ ముంబయి (56 శాతం), ఢిల్లీ (51 శాతం) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. నాలుగింట ఒక వంతు మంది కోల్‌కతా, బెంగళూరులకు ఓటేశారు.  ఇక, భారతీయుల విషయానికి వస్తే దాదాపు 48 శాతం మంది చైనాను సందర్శించాలని భావిస్తున్నారు. 
 
వీరంతా చదువు, ఉద్యోగం, వలస కోసం అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపించారు. చైనాలోని చూడదగ్గ టాప్‌ నగరాల్లో బీజింగ్ (51 శాతం), షాంఘై (49 శాతం) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. 20 శాతం మంది షెన్‌జెన్‌లో పర్యటించాలని భావిస్తున్నట్లు చెప్పారు.  చైనీయుల్లో సగం మంది భారతీయ సాహిత్యం, సినిమాలు, వివిధ షోలను ఆస్వాదిస్తుండగా, దాదాపు 30 శాతం మంది భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. 
 
సర్వేలో భాగంగా పొందుపర్చిన భారతీయ సినిమాలను 90 శాతం మంది వీక్షించడం విశేషం. దంగల్‌, త్రీ ఇడియట్స్‌లను 40 శాతం మంది చూస్, స్లమ్‌డాగ్ మిలియనీర్, దేవదాస్‌లను 20 శాతం మంది చూశారు. చైనా సినిమాలకు వస్తే సగానికిపైగా భారతీయులు వీక్షించారు. జర్నీ టు ది వెస్ట్ (15 శాతం), రొమాన్స్ ఆఫ్ ది త్రీ కింగ్‌డమ్స్ (14 శాతం) తొలి స్థానాల్లో ఉండగా… మీట్ యువర్‌సెల్ఫ్ (10 శాతం), ఫ్రై మీ టు ది మూన్ (10 శాతం) వంటివాటికి ఆదరణ లభించింది.
 
దాదాపు సగం మంది భారతీయులు మేడిన్ చైనా లేదా ఆ దేశంలో తయారైన బ్రాండెడ్ ఉత్పత్తులు కొనుగోలు చేశారు. 40 శాతం మంది అక్కడి యాప్‌లను వినియోగించారు. 30 శాతానికిపైగా మంది చైనా సాహిత్యం, సినిమాలు, షోలను చూశారు. చైనా బ్రాండ్ మొబైల్ ఫోన్‌లు ఒప్పో, వివో, వాటి ధరల గురించి భారతీయులకు అవగాహన ఉందని వెల్లడయ్యింది.
 
‘భారత్‌ అభివృద్ధిని క్రమంగా చైనీయులు గుర్తిస్తున్నారని, భవిష్యత్తులో ప్రపంచ వేదికపై ఢిల్లీని కీలక శక్తిగా పరిగణిస్తున్నారని ఈ సర్వే సూచిస్తోంది. మరిన్ని మార్గాల ద్వారా వారు పొరుగు భారత్‌లో వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు’ అని సింగువా యూనివర్సిటీ నేషనల్ స్ట్రాటజీ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధన విభాగం డైరెక్టర్ కియాన్ ఫెంగ్ అభిప్రాయపడ్డారు.
 
 ‘నేరుగా రాకపోకలు సాగించే విమానాల పునఃప్రారంభం, ఇరు దేశాల్లో జర్నలిస్ట్‌లను ఉంచడం, వీసా ఆంక్షల సడలింపు, పర్యాటకాన్ని ప్రోత్సహించడం, మేధో సంస్థల మధ్య చర్చలు వంటి చర్యలతో భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచి ఉద్రిక్తతలను తగ్గించవచ్చు ’ అని ఆయన అభిప్రాయపడ్డారు.