జి 7 సదస్సుకు ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీ

జి 7 సదస్సుకు ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీ

జి 7 శిఖరాగ్ర సదస్సు ఔట్‌రీచ్ సెషన్‌లో పాల్గొనేందుకు భారత ప్రదాని నరేంద్ర మోదీ ఇటలీకి చేరుకున్నారు.  మూడోసారి ప్రధాని అయిన తరువాత మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ నేపథ్యంలో ప్రధాని తమ ప్రకటన వెలువరించారు. కృత్రిమ మేధ(ఎఐ), ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం వంటి కీలక విషయాలు ఈ వేదిక నుంచి ప్రస్తావనకు వస్తాయని ఆయన ఇటలీకి బయలుదేరే ముందు తెలిపారు. 

ప్రధాని ఇటలీ పర్యటన ఇంతకు ముందే ఖరారు అయింది. జి 7 సదస్సులో గ్లోబల్ సౌత్‌కు సంబంధించిన పలు విషయాలు ప్రస్తావనకు వస్తాయని తెలిపారు.  ఇటలీలోని అపూలియా ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో ఈ నెల 13 నుంచి 15 వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. ఇటలీ ప్రధాని జియోజియా మెలోని ఆహ్వానం మేరకు తాను వెళ్లుతున్నానని కూడా ప్రధాని తెలిపారు.

ప్రధాని మోదీ రాక గురించి వివరిస్తూ, ఆయన బిజీ షెడ్యూల్ తర్వాత, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ లో “ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలోని అపులియాలోని బ్రిండిసి విమానాశ్రయాన్ని తాకారు. ఎజెండాలో పాల్గొనడం కూడా ఉంది. జి 7 సమ్మిట్ ఔట్‌రీచ్ సెషన్, ఈ సందర్భంగా ప్రపంచ నాయకులతో సమాలోచనలతో ఆయన తీరికలేకుండా గడపనున్నారు” అంటూ తెలిపింది. 

జి 7 వేదికలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.  సమావేశాలలో గాజాలో ఘర్షణ, ఉక్రెయిన్‌లో పరిస్థితి కూడా ప్రస్తావనకు వస్తుందని వెల్లడైంది. జి 7కు ఈసారి ఇటలీ అధ్యక్షత హోదాలో సమావేశాలు నిర్వహిస్తోంది.  తిరిగి అధికారం చేపట్టిన తరువాత విదేశాలకు వెళ్లుతున్న దశలో ఈ కీలక వేదికపై ఆయన పలువురు ప్రముఖ నేతలతో ద్వైపాక్షిక చర్చలకు వీలుంటుంది.

ఈ నేపథ్యంలో అభినందనలు కూడా స్వీకరిండం జరుగుతుందని అధికారులు తెలిపారు.  జి 7 సదస్సుకు ఇండియాతో పాటు మరో 11 దేశాల నేతలకు ఇటలీ నుంచి ఆహ్వానాలు అందాయి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండో పసిఫిక్ ప్రాంతంలోని 11 అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు తరలివస్తున్నారు.

కాగా, ప్రపంచ భౌగోళిక రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడంపై దృష్టి సారించేందుకు ఏర్పాటు చేసిన జి7 గ్రూపింగ్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీకి వెళుతున్నందున ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి ఉత్తమ ఎంపిక చర్చలు, దౌత్యమేనని భారత్ బుధవారం పునరుద్ఘాటించింది. ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి భారతదేశం అనుసరిస్తున్న విధానం ఏమిటని మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా అడిగినప్పుడు, “మేము ఎల్లప్పుడూ చర్చలు, దౌత్యమే ఉత్తమ ఎంపిక అని కొనసాగిస్తున్నాము” అని స్పష్టం చేశారు.