ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సమ్మిళిత, ధృడీకరణ ప్రజాస్వామ్యానికి పునాది

డా. సత్తు లింగమూర్తి

ఆర్థిక విశ్లేషకులు, కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం
2024 సాధారణ ఎన్నికలు మొదలవుతూనే భారత దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రముఖ నాయకులూ ఈవీఎం లపై సందేహాలను వ్యక్తం చేయడం జరిగింది. ఒక రకంగా ఎన్నికల ప్రచార సరళిలో ప్రతిపక్ష పార్టీలు ఈవీఎం లను ఒక అంశంగా చేర్చయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ భారత ప్రజలు ఈవీఎం లలో తమ ఓటుని నిక్షిప్తం చేసి ఇచ్చిన అద్భుత తీర్పుతో ప్రతిపక్షాలు కూడా నోరుమెదపడం లేదు. 
 
వరుసగా మూడోసారి కాబోయే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్డీయే పక్ష పార్టీల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రచారం చేసిన ఈవీఎం లు బ్రతికే ఉన్నాయా? లేదా మరణించాయా? (ఈవీఎం జిందా హై య మర్ గయా?)  అని వ్యంగం చేయడం మనం గమనించే ఉంటాము.
భారత ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యురాలైన డాక్టర్ షామికా రవి, శిశిర్ దేవనాథ్, ముదిత కపూర్ లు 2017 లో “ఎన్నికల అక్రమాలు, ప్రజాస్వాయం, అభివృద్ధిలపై ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ ల ప్రభావం” అనే వ్యాసాన్ని ప్రచురించారు. అది 2024 సాధారణ ఎన్నికలలో రాజకీయ నాయకులు లేవనెత్తిన అనేక రకాల ప్రశ్నలకు సమాధానాన్ని ఇవ్వగలదు.
గత మూడు దశాబ్దాలుగా భారతదేశం అన్ని వ్యవస్థలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం నానాటికి పెరుగుతూనే ఉంది. ఇదే పద్దతిలో దేశంలో అందరికి అందుబాటులో ఉండేవిధంగా, అనుకూలంగా ఉండేలా, సులభతరమైన పద్దతిలో, విశ్వాసాత్మకంగా ఉండేవిధంగా, అక్షరాస్యులకు-నిరక్షరాస్యులకు, యువకులకు-వృద్దులకు అందరికి సులభతరమైన పద్దతిలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత సమ్మిళితం చేయడానికి, ప్రజాస్వామ్యవ్యవస్థను మరింత దృఢతరం చేయడానికి భారత ఎలక్షన్ కమిషన్ ఈవీఎం లను ఎన్నికల సరళిలో ప్రవేశపెట్టడం జరిగింది.

ప్రతి సాంకేతిక ఆవిష్కరణ ప్రజలందరికి అనుభవంలోకి వచ్చేంతవరకు విమర్శలెదుర్కోవడం ఏ సమాజంలోనైనా పరిపాటి. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి భారత పౌరుని ప్రాథమిక భాద్యత. రానున్న 5 సంవత్సరాల కోసం ప్రతి పౌరుడు దేశంకోసం తన స్వరాన్ని ఓటు రూపంలో నిక్షిప్తం చేస్తాడు. పెన్సిల్, పేపర్ పద్దతితో పోలిస్తే సాంకేతిక పరిజ్ఞానం ఈవీఎం చెల్లని ఓట్లను తగ్గించి, రిగ్గింగును తగ్గించి బలహీనులను, నిరక్షరాస్యులను, నిమ్నవర్గాల వారిని బలవంతులుగా, సామర్త్యవంతులుగా చేస్తుంది.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో చూడబడిన సమర్థత, వేగవంతమైన ఫలితాలు పెద్ద జనాభా కలిగిన మన దేశానికి ఉపయోగపడే ప్రాముఖ్యతని సంతరించాయి. ఇటీవల జరిగిన భారత సాధారణ ఎన్నికలలో ఈవీఎం సాంకేతికత ఎన్నికల మోసాన్ని ఎలా పరిష్కరించిందని, ఎన్నికల విధానాన్ని సరళతరం చేసిందనేదానికి ఒక సాక్ష్యం. ఈ ఎన్నికలు దాదాపు 97 కోట్లు ఓటర్లలో 66 శాతంతో ఓటర్లు చారిత్రకంగా స్పందించారు. 
 
ఇంట పెద్ద పరిమాణం కలిగిన ప్రజాస్వామ్యం, సంక్లిష్టమైన బహు పార్టీల వ్యవస్థకు ఎన్నికల మోసం ప్రధాన సమస్య. కానీ భారత ఎన్నికల విధానంలో  ఈవీఎంల వినియోగం ఓటర్లకు వారి ఓటు ఎన్నికల ఫలితాలు, ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రయోజనకరంగా ఉంటుందని నమ్మకాన్ని ఇచ్చింది.
భారతదేశంలో ఈవీఎంలు ప్రయోగాత్మకంగా 1998 లో కొన్ని ప్రాథమిక నియోజకవర్గాలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పరిచయం చేశారు. భారతదేశంలో  ఈవీఎం సాంకేతికత వినియోగ లక్ష్యం ఎన్నికల ప్రక్రియలను బలపరచడం, ఎన్నికలు నిర్వహించే ఖర్చులను తగ్గించడం. ఈవీఎం లు ప్రవేశపెట్టిన ప్రారంభ దశలోనే విజయం సాధించిన తరువాత ఈ సాంకేతికతను తదుపరి అసెంబ్లీ ఎన్నికలలో దశలవారీగా ప్రవేశపెట్టారు. 2001 నుండి దేశవ్యాప్తంగా ఈవీఎంలు పేపర్ బ్యాలెట్ కు బదులుగా వాడడం జరుగుతుంది.

షామికా రవి గారి అధ్యయనం 2017 లో ప్రచురించారు. ఈవీఎంల వినియోగం భారతదేశంలో ఎన్నికల మోసం, ప్రజాస్వామ్యం మరియు అభివృద్ధిపై ప్రభావాన్ని పరిశీలించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల 1976 నుండి 2007 వరకు మరియు ఎన్నికల తరువాత సర్వే డేటా ఉపయోగించి,   ఈవీఎంల ప్రవేశంపై అధ్యయనం (i) ఎన్నికల మోసంలో గణనీయమైన తగ్గుదల, (ii) సమాజంలోని బలహీన, సున్నిత వర్గాలను బలపరచడం, (iii) మరింత పోటీ ఎన్నికల ప్రక్రియను కలిగించడం అనే పటిష్టమైన సాక్ష్యాలను అందిస్తుంది.

ఈవీఎం ల ప్రవేశానికి ముందు ఎన్నికల మోసంపై పేపర్ బ్యాలెట్ సిస్టం కింద పోలింగ్ బూత్ లు తరచుగా దొంగిలించబడేవి. బ్యాలెట్ బాక్స్ లు రిగ్గింగ్ చేయబడేవి. ఫలితంగా అత్యంత అధిక ఓటరు టర్నౌట్ మనకు అనిపించేది. ఈవీఎం లు ప్రతి నిమిషానికి కేవలం ఐదు ఓట్లు మాత్రమే నమోదు చేసే ముఖ్యమైన లక్షణాన్ని జోడించడం ద్వారా ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో సహాయపడింది. 
 
ఎన్నికల మోసం చేయడానికి పోలింగ్ బూత్ లను ఎక్కువ కాలం తాకడం అవసరం. ఇంకా రాజకీయంగా సున్నితమైన రాష్ట్రాలలో ఎన్నికల మోసం గణనీయంగా తగ్గిందని కూడా కనుగొన్నారు. అక్కడ ఎన్నికల రిగ్గింగ్ కారణంగా తరచుగా తిరిగి ఎన్నికలు నిర్వహించబడేవి.

ప్రజల ప్రాతినిధ్యంపై పేపర్ బ్యాలెట్ సిస్టం కింద బలహీన పౌరులు (నిరక్షరాస్యులు, మహిళలు, నిశ్చిత జాతులు, తెగలు, వికలాంగులు, వృద్ధులు) తమ ఓట్లు వేసే సామర్థ్యం దెబ్బతినిపోతుంది. నిరక్షరాస్యులు లేదా అశిక్షితులు పెద్ద మొత్తంలో ఉన్న ఈ దేశంలో, చీటీ బ్యాలెట్ సంతకాలు లేదా బొటనవేలి ముద్రలను ఓట్లు చెల్లుబాటుకు నిర్ణయించడంలో ఎన్నికల అధికారుల విచక్షణలోకి వస్తుంది. బలహీన విభాగాల ఓట్లు ఏమైనా పొరపాట్ల కారణంగా వాస్తవంగా తొలగుంపుకు గురవుతాయి. కేవలం ఈవీఎం సాంకేతికత మాత్రమే అన్ని రకాల ప్రజలను ఎన్నికలలో పాల్గొనటానికి, వారి ఓట్లు సరిగ్గా నిక్షిప్తం చేయడానికి, వాటి లెక్కింపును కూడా నిర్ధారిస్తుంది.


భారతదేశంలో ఈవీఎంల విజయంతో పాటు ఓట్లు వేసిన పద్దతిని ధృవీకరించడానికి సమగ్ర ఆడిట్ యంత్రాంగం అవసరమైంది. 2013 లో భారత ఎన్నికల కమిషన్ అధికారికంగా ఎన్నికల వ్యవస్థలలో ఓటరు ధృవీకృత పేపర్ ఆడిట్ ట్రైల్ (వివిపాట్) యంత్రాలను చేర్చింది.  వివిపాట్ – కాస్ట్ చేసిన ఓటు యొక్క పేపర్ ట్రైల్ వదిలివేస్తుంది – ఎన్నికల ప్రక్రియలో అదనపు ధృవీకరణ మరియు హామీ పరమైన పత్రం వలె పనిచేస్తుంది. ఓటు నిజంగా ఉద్దేశించిన అభ్యర్థికి వెళ్ళిందని, అలా నమోదు చేయబడిందని పేపర్ రికార్డు నిర్ధారిస్తుంది. అది ఆడిట్ ట్రైల్ లో భాగమవుతుంది. 

2019 లో భారత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఐదు పోలింగ్ బూత్ లలో  వివిపాట్ స్లిప్ లు, ఈవీఎంలతో ర్యాండమ్ మ్యాచింగ్ జరిగింది. 1.73 మిలియన్  వివిపాట్ లలో 20625  వివిపాట్ ల నుండి స్లిప్ లను భౌతికంగా లెక్కించబడింది. భౌతిక ఆడిట్  వివిపాట్ స్లిప్,  ఈవీఎం లెక్కల మధ్య ఒక్కటి కూడా బేధాన్ని కనుగొనలేదు.
ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఒకే స్వరం కలిగి ఉండే, అందరూ బాధ్యత వహించే పరిపాలన వ్యవస్థ వైపు దూసుకుపోవడం మనం గమనించవచ్చు. ప్రజల పాలన, ప్రజల కోసం, ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వాన్ని సాధించడానికి  సాంకేతికతను ఉపయోగించవచ్చని  చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తక్కువగా లేదా ఎటువంటి పొరపాట్లతో ఇంత పెద్ద పరిమాణంలో  ఈవీఎం లను విజయవంతంగా ఉపయోగించి, భారతదేశం ఇప్పుడు ‘టెక్నో-ప్రజాస్వామ్యం’ గా మారుతోంది. 
 
ఇది ఇతర ప్రజాస్వామ్యాలలో పునరావృతం చేయదగినదిగా,  ప్రతి 5 సంవత్సరాలకు జరిగే ప్రజా పాలనను మళ్ళీ ఆవిష్కరించడానికి ఈవీఎం ఎన్నికల వ్యవస్థలో నిజంగా వినూత్న మరియు విప్లవాత్మకమైన సంస్కరణ అని చెప్పుకోవచ్చు.