కొత్త ఎంపీలలో 80 శాతం మంది గ్రాడ్యూయేట్లే

కొత్త ఎంపీలలో 80 శాతం మంది గ్రాడ్యూయేట్లే
ఈ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా విద్యావంతులేనని అసోషియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక స్పష్టం చేసింది. ఈ 18వ లోక్‌సభలో ఒక్క చదువురాని ఎంపీ కూడా లేరని తెలిపింది. ఈ ఎన్నికల కోసం మొత్తం 121 మంది నిరక్ష్యరాస్యులు నామినేషన్‌లు దాఖలు చేయగా వారిలో ఒక్కరూ కూడా ఎంపీగా విజయం సాధించలేకపోయారని వెల్లడించింది.

ఏడీఆర్‌ నివేదిక ప్రకార ఈ లోక్‌సభకు ఎన్నికైన 543 మంది ఎంపీల్లో అత్యధిక మంది ఉన్నత విద్యావంతులే ఉన్నారు. కేవలం ఒక్క ఎంపీ మినహా మిగిలిన అందరూ సంబంధిత ధృవపత్రాలను కలిగి ఉన్నారు. ఆ ఒక్క ఎంపీ దగ్గర మాత్రమే విద్యాసంబంధ ధృవపత్రాలు లేవు. 

మొత్తం 105 మంది ఎంపీలు, అంటే సుమారుగా 19 శాతం ఎంపీలు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యను అభ్యసించి ఉన్నారు. వారిలో కేవలం ఆరుగురు ఎంపీలు మాత్రమే 10వ తరగతి లోపు విద్యను అభ్యసించారు. మరో 34 మంది 10వ తరగతి పాసయ్యారు. 

ఇంకో 65 మంది ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులయ్యారు. 98 గ్రాడ్యుయేట్‌ ప్రొఫెషనల్స్‌ ఉన్నారు. సుమారు మూడు శాతం మంది డిప్లొమా చేశారు. 147 మంది గ్రాడ్యుయేషన్‌, మరో 147 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. అదేవిధంగా మొత్తం ఎంపీల్లో 5 శాతం మంది డాక్టరేట్‌ సాధించిన వాళ్లు ఉన్నారు.

ఇక పార్టీల వారీగా చూస్తే బీజేపీకి చెందిన 240 మంది ఎంపీల్లో 64 మంది గ్రాడ్యుయేట్‌లు, 49 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌లు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 99 మంది ఎంపీల్లో 24 మంది గ్రాడ్యుయేషన్‌, 27 మంది పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు.