వాసుదేవరెడ్డి ఇంట్లో ఏపీ సిఐడి సోదాలు

వాసుదేవరెడ్డి  ఇంట్లో ఏపీ సిఐడి సోదాలు
ఏపీలో ఐదేళ్లుగా మద్యం వ్యాపారాన్ని, లిక్కర్ డిస్టిలరీ సిండికేట్లను నడిపించారనే అభియోగాలతో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సిఐడి సోదాలు నిర్వహిస్తోంది. రాజకీయ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం వాసుదేవరెడ్డిని బేవరేజెస్ కార్పొరేషన్‌ పదవి నుంచి తప్పించింది.

ఏపీలో మద్యం ధరల్ని పెంచడం, ఊరు పేరు లేని నాసిరకం మద్యం బ్రాండ్లను విక్రయించడంలో వేల కోట్ల రుపాయల అక్రమాలు జరిగాయని ఐదేళ్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో మద్యం పాలసీ పేరుతో మద్యం ధరల్ని గణనీయంగా పెంచేసి, తమకు అనుకూలంగా ఉన్న బ్రాండ్లను మాత్రమే ఐదేళ్లుగా విక్రయించడం ద్వారా ప్రభుత్వం వేల కోట్ల అక్రమాలకు పాల్పడిందని బీజేపీ పలుమార్లు ఫిర్యాదు చేసింది.

బేవరేజెస్‌ కార్పొరేషన్ ఆదాయాన్ని చూపించి వేల కోట్ల రుణాలను తీసుకున్నారని, ఆర్ధిక అవకతవకలు పెద్ద ఎత్తున జరిగాయని ఎన్నికలకు ముందు పలుమార్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు డి పురందేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. బేవరేజెస్‌ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి వాటిలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే డిస్టిలరీల్లో తయారైన నాసిరకం మద్యాన్ని విక్రయించారని, బాట్లింగ్ ధరకు, విక్రయ ధరకు భారీ వ్యత్యాసం ద్వారా వేల కోట్లు పక్కదారి పట్టాయని విపక్షాలు ఆరోపించాయి.

రాజకీయ పార్టీల ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ వెలువడిన వెంటనే ఆయనపై వేటు పడింది. ఎన్నికలకు ముందే తన మాతృ సంస్థకు వెళ‌్ళిపోయేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టింది.

హైదరాబాద్ నానక్‍రామ్‍గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం దోపిడీకి పూర్తి సహకారం అందించడం ద్వారా అక్రమాలను ముందుండి నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. డిస్టిలరీను స్వాధీనం చేసుకోవడం, మద్యం తయారీ సంస్థల్ని నయానో భయానో లొంగదీసుకోవడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి.