గాజాలో ఓ పాఠశాలపై దాడి .. 35 మంది మృతి

గాజాలో ఓ పాఠశాలపై దాడి .. 35 మంది మృతి

గాజాలో మారణహోమం ఆపాలని, అనేక వేలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచదేశాలు విమర్శలు గుప్పిస్తున్నా ఇజ్రాయెల్ తన దాడులను ఆపడం లేదు. గురువారం తెల్లవారు జామున గాజా లోని ఓ పాఠశాల భవనంపై జరిగిన వైమానిక దాడిలో అక్కడ తలదాచుకుంటున్న 35 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 

వారిలో తొమ్మిది మంది మహిళలు, 14 మంది చిన్నారులని స్థానిక అధికారులు తెలిపారు. నుసేర‌త్ శ‌ర‌ణార్థి క్యాంపులో ఉన్న స్కూల్ టాప్ ఫ్లోర్‌పై ఇమ్రాయిల్ యుద్ధ విమానాలు రెండు మిస్సైళ్ల‌తో అటాక్ చేశాయి. దాడిలో గాయ‌ప‌డ్డ‌వారిని అంబులెన్సుల్లో రెస్క్యూ బృందాలు త‌ర‌లిస్తున్నాయి. క్లాస్‌రూమ్‌లు ధ్వంసం అయ్యాయి. మృత‌దేహాలు చెల్లాచెదురుగా ప‌డి ఉన్న వీడియోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి.

 అయితే ఆ స్కూలును హమాస్ ఉగ్రవాదులు తమ స్థావరంగా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారని ఇజ్రాయెల్ సైన్యం (ఐడిఎఫ్) ఆరోపించింది. హమాస్ ఉగ్రవాదులు మళ్లీ ఏకమవుతున్నారన్న సమాచారంపై సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ మరోసారి దాడులు ప్రారంభించింది.

ఈ పరిస్థితి లోనే సుసిరత్‌లో “యూఎన్‌ఆర్‌డబ్లుఏ” ఆధ్వర్యంలో నడిచే అల్‌సర్దీ పాఠశాల భవనంపై క్షిపణులతో దాడి చేసింది. ప్రస్తుతం శరణార్థి శిబిరంగా ఉన్న ఇందులో పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ దాడిలో రెండో, మూడో అంతస్తులు ధ్వంసం కాగా, దాదాపు 35 మంది మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

సమీపం లోని మరో ప్రాంతం పైనా జరిగిన దాడిలో ఆరుగురు మృతి చెందారు. గతవారం రఫాలో యూఎన్‌ఆర్‌డబ్లుఏ కేంద్రం సమీపంలో జరిగిన దాడలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.