ఏపీలో 53 శాతం ఓట్లతో ఎన్డీయే ప్రభుత్వం

* ఏపీలో కూటమిదే విజయం … ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్

ఏపీలో ఎన్డీయేకు 21 వరకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైందని, రాష్ట్రంలోనూ 53 శాతం ఓట్లతో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఇన్ ఛార్జ్ అరుణ్ సింగ్ తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురందేశ్వరిలతో కలిసి ఆయన ఆదివారం ఏపీలో పోటీచేసిన లోక్ సభ, అసెంబ్లీ కూటమి అభ్యర్థులతో జూమ్ లో మాట్లాడారు.

ఓట్ల లెక్కింపులో అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ అడిగాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైసీపీ కౌంటింగ్ సమయంలో కూడా ఘర్షణకు దిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రతి అభ్యర్థి లీగల్ టీంను అందుబాటులో ఉంచుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు.

ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని టీడీపీ చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. ‘‘ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమి విజయం వైపే మొగ్గు చూపించాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది” అని తెలిపారు. 

అభ్యర్థి ఎవరైనా ఓట్లు బదిలీ కావాలన్న ఉద్దేశంతో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారని చెబుతూ ఓటమి భయంతో కౌంటింగ్ పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిని ఇప్పటికే అధికార పార్టీ మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు. 

“పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారు. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉంది….కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలి. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పనిచేయాలి” అని చంద్రబాబు సూచించారు.

ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ ల నుంచి తీసుకొచ్చే సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు అప్రమత్తంగా వ్యహరించాలని చంద్రబాబు హెచ్చరించారు. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకూ ఎవరూ అశ్రద్ధ వహించొద్దని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఆర్వో వద్ద డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుండి బటయకు రావాలని చంద్రబాబు సూచించారు.

మరోవంక, తాజాగా ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఎన్డీఏ కూటమికి 98-120 సీట్లు, వైసీపీకి 55-77 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గేమ్ ఛేంజర్ అవుతారని స్పష్టం చేసింది. 
 
ఇక పార్టీల పరంగా ఓట్ షేర్‌ లో టీడీపీకి 42శాతం, వైసీపీకి 44 శాతం, జనసేనకు 7శాతం, బీజేపీకి 2శాతం, కాంగ్రెస్‌ కు 2 శాతం, ఇతరులు 3 శాతం ఓటింగ్ శాతం వస్తాయని అంచనా వేసింది. అలాగే లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ లో టీడీపీ 13-15 స్థానాలు, జనసేన 2, బీజేపీ 4-6 ఎంపీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని, వైసీపీ 2-4 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే అంచనా వేసింది.