‘ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌’లకు తోక ముడిచిన కాంగ్రెస్

లోక్ సభ ఎన్నికలలో బిజెపి వెనుకబడిందని, తమ కూటమి అధికారంలోకి రాబోతోందని చెప్పుకొకంటున్న కాంగ్రెస్ నాయకులు  జూన్ 1న టెలివిజన్ ఛానళ్లలో జరిగే ఎగ్జిట్ పోల్ డిబేట్లలో పాల్గొనబోమని చెబుతూ తోకముడిచారు.  లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత శనివారం సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడనున్నాయి. 

కాగా, జూన్ 4న వాస్తవ ఫలితాలు వెలువడే ముందు ఊహాగానాలు, వదంతులకు తావివ్వకూడదని పార్టీ నిర్ణయించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా శుక్రవారం తెలిపారు.

 ”ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తీర్పు పదిలంగా ఉంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. దీనికి ముందే టీఆర్‌పీ కోసం ఊహాగానాలు, వాదోపవాదాలకు తావీయాల్సిన అవసరం కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్‌పై జరిగే చర్చల్లో కాంగ్రెస్ పాల్గొనడం లేదు. 4వ తేదీ నుంచి ఏ డిబేట్‌లో పాల్గొనేందుకైనా మేము సిద్ధం” అని పవన్ ఖేరా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపారు.

కాగా, ఎగ్జిట్స్ పోల్స్ పేరుతో ఊహాగానాల అవసరం ఏముందని పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ఛానెల్స్ టీఆర్‌పీ పెంచడం కోసం అర్ధం లేని ఊహాగానాలు చేయాల్సిన పనేముంది? అని ప్రశ్నించారు. కొన్ని శక్తులకు బెట్టింగ్‌తో ప్రమేయం ఉంటుందని, అందులో తాము పాలుపంచుకోవాలని అనుకోవడం లేదని చెప్పారు. 

ప్రతి ఒక్కరికీ తాము ఎవరికి ఓటు వేశామో తెలుసునని, జూన్ 4న తమకు ఎన్ని ఓట్లు పోలయ్యాయో పార్టీలకు తెలుస్తుందని, దీనిపై ఊహాగానాలకు ఎందుకని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తాము గెలవబోతున్నామని, జూన్ 4 తర్వాత ‘ఇండియా’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 వరకూ ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలపై ఎన్నికల కమిషన్ నిషేధం ఉంది. ఆ గడవు పూర్తికాగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పలు స్వంతంత్ర, మీడియా సంస్థలు ప్రకటిస్తాయి. చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. 1957 నుంచి ఇండియాలో ఎగ్జిట్ పోల్స్ ప్రారంభమయ్యాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌కు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి.

 ఏజెన్సీలు, పోల్ స్టర్లు, సెఫాలజిస్టులు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సిద్ధం చేస్తారు. ఈ మధ్య కాలంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తుది ఫలితాలతో సరిపోతున్నాయి. దాంతో, వాటికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై టీవీ చానెళ్లు డిబేట్లు నిర్వహిస్తుండగా, ఎగ్జిట్ పోల్ డేటాపై రాజకీయ పార్టీల ప్రతినిధులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎగ్జిట్ పోల్ చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ వెనుకాడటం గమనార్హం.