కేంద్ర హోంశాఖకు బాంబు బెదిరింపు

దేశంలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. గత కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర సంచలనంగా మారింది. పాఠశాలలు, ఆస్పత్రులు, ఎయిర్‌పోర్టులు సహా కీలక ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు పోలీసులకు ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ క్రమంలోనే తాజాగా ఏకంగా కేంద్ర హోంశాఖకే బాంబు హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ బాంబు హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు, అధికారులు అప్రమత్తం అయ్యారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న కేంద్ర హోం శాఖ కార్యాలయానికి బుధవారం మధ్యాహ్నం బాంబు బెదిరింపు రావడం సంచలనంగా మారింది. నార్త్ బ్లాక్ వద్ద బాంబు ఉందని, పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ-మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. 
 
ఈ బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి నార్త్ బ్లాక్ వద్దకు 2 ఫైర్ ఇంజిన్లను తరలించారు. అంతేకాకుండా బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి.. నార్త్ బ్లాక్ ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
 
మరోవైపు ఆ బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు అందులో ఎంత వరకు నిజం ఉంది? ఇలా వరుసగా బెదిరింపు ఈ-మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు పంపిస్తున్నారు?అని విచారణ చేస్తున్నారు. వీటిని ఎవరు పంపిస్తున్నారు?ఎందుకు పంపిస్తున్నారో తెలుసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
 
గత కొన్ని వారాలుగా దేశంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతం, గుజరాత్, జైపూర్, ఉత్తర్‌ప్రదేశ్‌, బెంగళూరు సహా వివిధ ప్రాంతాలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం చూస్తూనే ఉన్నాం. 
 
బాంబు పేలుడు బెదిరింపులతో దేశంలో అలజడి సృష్టించాలని ఆగంతకులు చూస్తున్నట్లు భద్రతా బలగాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, సున్నితమైన ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన బెదిరింపులు అన్నీ బూటకమే అని అధికారులు తేల్చారు.