ఆప్‌కు రూ. 7 కోట్లకు పైగా విదేశీ నిధులు

ఆప్‌కు రూ. 7 కోట్లకు పైగా విదేశీ నిధులు

ఢిల్లీ, పంజాబ్‌లను పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎఫ్‌సిఆర్‌ఎకు విరుద్ధంగా రూ. 7 కోట్లకు పైగా విదేశీ నిధులు అందుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఎ)కు లేఖ రాసినట్లు అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి.  2014 నుండి 2022 మధ్య అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమాన్ ల నుండి ఈ నిధులు సమకూర్చుకున్నట్లు తెలిపింది. నిధులు సమకూర్చిన వారి వివరాలను ఆప్ గోప్యంగా ఉంచినట్లు చెప్పింది.

పంజాబ్ మాజీ ఆప్‌ఎంఎల్‌ఎల సుఖ్‌పాల్ సింగ్ ఖైరాపైన, మరికొందరిపైన డ్రగ్స్‌తో ముడిపడిన మనీ లాండరింగ్ దర్యాప్తు సమయంలో తాను కొన్ని డాక్యుమెంట్లు, ఇమెయిల్స్ స్వాధీనం చేసుకున్న తరువాత ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఈడీ ఎంహెచ్‌ఎకు ఆ లేఖ పంపింది. ఈడీ  ఈ దర్యాప్తును 2021లో ప్రారంభించింది.

 అదే సంవత్సరం ఖైరాను ఈడీ  అరెస్టు చేసింది. ఖైరా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఆప్ ఉల్లంఘనలను వివరిస్తూ, విదేశీ నిధుల క్రమబద్ధీకరణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ), ప్రజా ప్రాతినిధ్య చట్టం (ఆర్‌పిఎ)లకు అవి విరుద్ధమైనవిగా పేర్కొంటూ ఈడీ  కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖకు ఒక సమగ్ర సమాచార పత్రాన్ని పంపినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఈ కేసులో తాజా వివరాలు కొన్నిటిని ఎంహెచ్‌ఎతో ఇడి ఇటీవల పంచుకున్నట్లు తెలుస్తోంది.

ఆప్ ఇప్పటి వరకు దాదాపు రూ. 7.08 కోట్ల మేరకు విదేశీ విరాళాలు స్వీకరించిందని, కొన్ని ఇతర వివరాలతో పాటు విదేశీ దాతల పేర్లు, జాతీయతలను ఆ పార్టీవారు ‘తప్పుగా వెల్లడించారు, వక్రీకరించారు’ అని ఈడీ  కనుగొన్నదని ఆ వర్గాలు తెలిపాయి. కాగా, ఎఫ్‌సిఆర్‌ఎ ఉల్లంఘనల కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) దర్యాప్తు చేస్తుంటుందని, ఈడీ  చేసిన ఆ ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ సిబిఐకి హోమ్ మంత్రిత్వశాఖ లేఖ రాయగలదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.