స్పామ్‌ కాల్స్‌ నియంత్రణకు త్వరలోనే కొత్త మార్గదర్శకాలు

స్పామ్‌ కాల్స్‌ నియంత్రణకు త్వరలోనే కొత్త మార్గదర్శకాలు
ఇప్పుడు మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులు ఎదుర్కొంటున్న కామన్‌ సమస్య.. స్పామ్‌ కాల్స్‌. మన ఫోన్‌కు వచ్చే కాల్స్‌లో తెలిసిన వాళ్లు చేసే వాటికంటే కూడా కస్టమర్‌ కేర్‌ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లే ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. వీటి బెడద నుంచి తప్పించుకునేందుకు డు నాట్ డిస్ట్రబ్‌ అనే సర్వీస్‌ను కూడా టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌ ) తీసుకొచ్చింది. అయితే లాభం లేకుండా పోయింది. 
 
డీఎన్‌డీ యాక్టివ్‌ చేసుకున్నప్పటికీ ఈ స్పామ్‌ కాల్స్‌ ఎక్కువగానే వస్తుంది. ఇలా ట్రాయ్‌ అనేక రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఈ స్పామ్‌ కాల్స్‌కు అడ్డుకట్ట వేయలేకపోతుంది. ఈ క్రమంలో స్పామ్‌కాల్స్‌కు చెక్‌పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగింది. స్పామ్‌ కాల్స్‌ నియంత్రణకు త్వరలోనే కొత్త మార్గదర్శకాలు జారీ చేయడానికి సిద్ధమయ్యింది.

ఇలాంటి స్పామ్‌ కాల్స్‌ నియంత్రణ కోసం ఇప్పటికే డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ టెలీకమ్యూనికేషన్స్‌, టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) మార్గదర్శకాలను రూపొందించింది. రిజిస్టర్‌ కాని మొబైల్‌ నంబర్స్‌, అన్‌వాంటెడ్‌ కాల్స్‌ నియంత్రణ కోసం పలు పరిష్కార మార్గాలను ఇందులో ప్రతిపాదించింది. సాధారణంగా స్పామ్‌ కాల్స్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల నుంచే ఎక్కువగా వస్తుంటాయి. 

కాబట్టి వీటి నుంచి ప్రయోజనం పొందుతున్న కంపెనీలే ఈ స్పామ్‌ కాల్స్‌కు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. ట్రాయ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే టెలికాం సంస్థలు భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇక స్పామ్‌ కాల్స్‌ను గుర్తించేందుకు వీలుగా వాటి ఐడెంటిటీని టెలికాం సంస్థలు వెల్లడించాల్సి ఉంటుంది. 

ఇందుకోసం 3 వేర్వేరు సిరీస్‌లను తీసుకురానున్నారు. మార్కెటింగ్‌ కాల్స్‌ కోసం అయితే 140, సర్వీస్‌ కాల్స్‌ కోసమైతే 160, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కమ్యూనికేషన్‌ కోసం అయితే 111 ఇవ్వాలని ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం. 

ఇలా సిరీస్‌ల ద్వారా ప్రతి కాలర్‌ పేరు, సెక్టార్‌ సహా తదితర వివరాలను బహిర్గతం చేయడం ద్వారా కష్టమర్లు తమకు వచ్చే కాల్స్‌ను లిఫ్ట్‌ చేయాలా? వద్దా? అనేది నిర్ణయించుకునే వీలు ఉంటుంది. టెలికాం సంస్థలతో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత వారం జరిపిన చర్చల అనంతరం ఈ మార్గదర్శకాలను రూపొందించారు.