బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు

బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు
బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విఠల్ తర్వాత స్థానంలో నిలిచిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే అవకాశం ఉంది.
 
తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, ఫోర్జరీ సంతకాలతో దండె విఠల్ తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలిచ్చారని పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ లేబోరెటరీ పంపించాలని కోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత విఠల్ ఎన్నికల రద్దు చేస్తున్నామని తీర్పు వెలువరించింది.
 
బీఆర్ఎస్ అధికారిక అభ్యర్థిగా దండే విఠల్ 2022 స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేశారు. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో రాజేశ్వర్ రెడ్డిని పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా విఠల్ సంతకం పోర్జరీ చేశారు. 
 
రాజేశ్వర్ రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్టు ఫోర్జరీ సంతకాలతో రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు ఇచ్చారు. దీంతో రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణకు గురైంది. విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన రాజేశ్వర్ కోర్టును ఆశ్రయించారు. తాను నామినేషన్‌ను ఉససంహరించుకోలేదని, నా సంతకాన్ని ఫోర్జరీ చేశారని కోర్టుకు తెలిపారు.
 

దండె విఠల్ ఎన్నిక చెల్లదని, ఆయన శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజేశ్వర్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొ్న్నారు. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నిక రద్దు చేయడంతో పాటు న్యాయస్థానం రూ.50 వేల ఫైన్ విధించింది. కాగా  హైకోర్టు తీర్పుపై దండె విఠల్ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేయగా.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దండె విఠల్ సైతం సుప్రీం కోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.