
పశ్చిమ అఫ్గానిస్థాన్ లోని షియా ముస్లిం మైనార్టీకి చెందిన మసీదు లోకి సాయుధుడైన ముష్కరుడు చొరబడి కాల్పులు జరపడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మసీదు ఇమామ్ కూడా ఉన్నారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా దుండగుడు వారిపై కాల్పులకు పాల్పడ్డాడు.
దాడికి పాల్పడిన దుండగుడు పారిపోతూ కాల్పులు జరపడంతో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హేరత్ ప్రావిన్స్లో గుజారా జిల్లాలో షియా ముస్లిం మసీదులో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనకు తాము బాధ్యులమని ఎవరూ ఇంతవరకు ప్రకటించలేదు. ఇమాన్ జమాన్ మసీదుపై ఈ దాడి జరగడాన్ని తాను ఖండిస్తున్నానని తాలిబన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతేన్ ఖనీ ఆవేదన వెలిబుచ్చారు.
ఈ ఉగ్రదాడి అన్ని మతాల , మానవతా ప్రమాణాలపై దాడిగా తాను భావిస్తానని మాజీ అఫ్గాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయి ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. నేరస్థులకు తక్షణం జవాబు చెప్పాలని స్పష్టం చేశారు. షియా వర్గానికి రక్షణ చర్యలు కల్పించాలని కోరారు. అఫ్గానిస్థాన్ లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ వర్గం తాలిబన్కు ప్రధాన వైరివర్గం. తరచుగా స్కూళ్లు, ఆస్పత్రులు, మసీదులు, షియా ప్రాంతాలపై దాడులు చేస్తున్నారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక