
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై పీసీసీ లీగల్ సెల్ నేతలు వివరణ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరిక లేకుండా ఉన్నందున నాలుగు వారాల గడువు కావాలని ఢిల్లీ పోలీసులను కోరినట్లు లీగల్ సెల్ నాయకులు తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఇటీవలే గాంధీభవన్లో పోలీసులు నోటీసులిచ్చారు. బుధవారం ఢిల్లీలో తమ ముందు హాజరుకావాలని అందులో తెలిపారు. రేవంత్ రెడ్డి సహా పీసీసీ సామాజిక మీడియా ఛైర్మన్ మన్నెే సతీశ్, నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్కి దిల్లీ పోలీసులు నోటీసులు అందించారు.
ఐతే సాంకేతికపర అంశాలని పూర్తిస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉన్నందున లీగల్ సెల్ ఛైర్మన్ మన్నే సతీశ్, మరో ముగ్గురికి రెండు వారాలు గడువు కావాలని కోరినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తున్నందున బుధవారం విచారణకు రాలేరని తెలిపారు.
కాగా, కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్త గీత ఫోన్ను ఢిల్లీ పోలీసులు జప్తు చేశారు. సికింద్రాబాద్ శాంతినగర్కు చెందిన గీతకు 41ఏ నోటీసులు ఇచ్చి, ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈనెల 23వ తేదీన తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఆ హక్కులను తిరిగి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చేస్తామని తెలిపారు.
కానీ కొంత మంది ఆ మాటలను వక్రీకరించి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెబుతున్నట్లు ఎడిట్ చేశారని కేంద్ర హోంశాఖ, బీజేపీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేశారనే అభియోగంతో సీఎం రేవంత్ రెడ్డి సహా మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు.
ఈ నోటీసులను నేరుగా గాంధీభవన్కు పంపించారు. మే 1వ తేదీన విచారణకు హాజరుకాని పక్షంలో సీఆర్పీసీ 91/160 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అందులో వివరించారు. ఢిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం వారు ఏప్రిల్ 28న ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 153, 153ఏ, 465, 469, 171జీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ప్రకారం నోటీసులు ఇచ్చారు.
మరోవంక, జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ నోటీసుల అంశంపై ఘాటుగానే స్పందించారు. రిజర్వేషన్ల రద్దుపై తాను ప్రశ్నించినందుకు, బీజేపీ నేతలు ఈడీ ఐటీ సీబీఐతోనే కాకుండా ఢిల్లీ పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లపై మాట్లాడుతుంటే తనపై దేశ హోంమంత్రే కేసు పెట్టారని విమర్శించారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన